Thursday, January 8, 2015

One Step

ఒక్క అడుగు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, KCR  ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు అయిపోయింది.  KCR గారు ప్రతి రోజు మీటింగులు పెడ్తు కొత్తకొత్త అభివృద్ధి ప్లాన్లు వెస్తున్నడు.  అన్ని వింటున్న ప్రజలు కలల్లో తెలిపోతున్నరు.  చెప్పిన వాటిల్లో సగమైన అయితే తెలంగాణ బతుకులు బంగారమే అయితై.  అది స్వచ్చమా లేక వన్ గ్రామ్ గోల్డా కాలమే నిర్ణయిస్తుంది.  ఏది జరగకున్న కనీసము చెరువుల పూడికతీత అయి నీళ్ల సౌకర్యం మెరుగైందంటే 2019లో మళ్ళి రాష్ట్రములో తెరాస రావడం ఖాయమ్.
KCR చేసిన సమగ్ర సర్వే ఆయనకు ప్రపంచ ఖ్యాతి  తెచ్చింది.  అంత ఘనమైన సమగ్ర సర్వే చేసినంక మళ్ళి పిల్లల స్కాలర్షిప్ల గురించి, పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి రకరకా సర్టిఫికెట్లు అడగటము చికాకు కలిగించిన విషయము.  సమగ్ర సర్వేలో తెలుసుకున్న విషయలన్నీ  రెండు మూడునెలల్లో క్రోడికరించి పరిపాలన సౌలభ్యానికి ఉపయోగించుకుంటమన్నరు.  ఆ సర్వే రిపోర్ట్ ఇవ్వలే పేపర్లో వచ్చింది.  ఇక ప్రజా అభ్యుదయ పతకాలు ముందుకు పోవటము సులువైతుందనుకుంట.
ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంతమంది భూకబ్జకోరుల మీద కొరడ ఝులిపించినట్టె ఝులిపించి తర్వాత చాల రోజులు ఏమి మాట్లాడలేదు.  మళ్ళి మొన్న కబ్జాదారులందారు  రెగ్యులరైజేషన్ చేసుకొమ్మని నోటిఫికేషన్ ఇచ్చిన్రు.  ఇది ఎవరికి సాయం చేయడానికి?  దీని వలన వందల కోట్లు  లాభం పొందేది అన్ని ప్రాంతాల పార్టీల నాయకులు, బడా బాబులే కాదా?  మళ్ళి దాన్ని కొద్ది రోజులకోసం పక్కకు పెడుతున్నరు.  అంటె మరి కొంతమంది బడాబాబులు  ఎక్కడైన జాగలుంటె కబ్జచేసుకోవడానికి సమయమిచ్చి ఆ తర్వాత రెగ్యులరైజేషను చేస్తరా ?
తెలంగాణ సాధించిన వ్యక్తిగా KCR పై ప్రజలకు చాల గౌరవమే ఉన్నది.  వారి జీవతాలు కాస్తైన కెసిఆర్ పాలనలో బాగుపడ్తయని   బండెడు ఆశలు పెట్టుకున్నరు.  ప్లాన్ల కలలు వినివిని విసుగొస్తుంది.  Ground లెవెల్లో కాస్తైన మార్పు వస్తే అప్పుడు సంబురమైతది.
                                                      ********************

"Imitation is the best flattery" అంటరు.  ఆంధ్ర బాబు చంద్రబాబు నాయుడుకు కొత్త అలోచనలు ఏమి వస్తలేవు.  ఇంకా కాంగ్రెసును తిట్టుకుంట గతాన్నే నేమరేస్తూ , వర్తమానంలో కెసిఆర్ పథకాలనే కాపికొడ్తున్నడు.  తెలంగాణన్నా,  కెసిఆర్ అన్నా  చాల అసహనంతో వ్యవహరిస్తున్నడు.  ఇది ఒక అనుభవమున్న తెలివైన నాయకుడు చేయాల్సిన పని కాదు. ఇది ముందు ముందు ఎట్లాంటి చిక్కులు తెచ్చిపెడ్తుందో చూడాలి.
                                                       ***************************

నా చిన్నప్పుడు ఒక కథ చదివాను.
రామయ్య, సోమయ్య ఇద్దరు ఇరుగుపొరుగు వాళ్ళు.  రామయ్య తెలివైనవాడు.  కష్టపడె రకం.  సోమయ్య కూడ అన్నిట్లో సమ ఉజ్జీ అయిన ఎప్పుడు రామయ్యతో పోటి పెట్టుకొని ఆయన్ని మించిపోవాలనుకునెవాడు.  ఒకసారి ఆ ఊరికి మహిమలుగల మునీశ్వరడు వచ్చాడు. ఆ మహానుభావున్ని ఉళ్ళో ప్రతి ఒక్క కుటుంబము వారి ఇంటికి పిలిచి ఆతిథ్యము ఇచ్చెవారు.  రామయ్య, సోమయ్య వంతు వచ్చినప్పుడు సోమయ్య వెళ్లి మునీశ్వరున్ని ముందు తన ఇంటికి రావాల్సిందని ప్రార్థించి తీసుకొచ్చాడు. మునీశ్వరుడు సోమయ్య ఆతిథ్యానికి సంతోషించి ఏమి కావాలో కోరుకోమన్నడు. దానికి సోమయ్య రామయ్య ఏమి కోరుకుంటే దానికి రెండింతలు తనకివ్వమని కోరుకున్నడు. 'తథాస్తు' అని మునీశ్వరుడన్నడు   ఆ తర్వాత మునీశ్వరుడు రామయ్య ఇంటికి వెళ్లి అతని ఆతిథ్యము తీసుకున్నడు.  రామయ్యను కూడ ఏదైనా కోరిక వుంటె చెప్పితే తీరుస్తని  సెలవిచ్చాడు.  తన ఇంట్లో నుండి అంతకు ముందె సోమయ్య కోరిక విన్నాడు రామయ్య.  సోమయ్యకు గుణపాఠం నేర్పించాలనుకున్నడు.  మునీశ్వరుడిని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నడు.  మునీశ్వరుడు 'తథాస్తు' అన్నడు.  ఆ తర్వాత సోమయ్యకేం అయిందో ఎవరైనా ఊహించవచ్చు.  

Sunday, January 4, 2015

Musing

నాలో నేను 

ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే రకరకా ఆలోచనా తరంగాలు ఎగిసిపడుతుంటాయి.  జీవితం అంటే ఏంటో అర్థమయ్యేసరికి జీవిత కాలం సరిపోదనిపిస్తుంది.  
అన్ని జీవరాసుల్లో పంచభూతాలు అంతర్లీనమై వున్నా బుద్ధి, మనస్సు, అహంకారం మానవులలో మాత్రమే వ్యక్తమౌతుంది. మనస్సు ఇంద్రియాలకు అలవాలామైతే అది జంతువుల్లో వున్నట్లే. ఎందుకంటె అవి పూర్తిగా ఇంద్రియాలకు లోబడే పనిచేస్తుంటాయి. వీటిలో కొంతమేరకు అహంకారము కూడ వుంటుందేమో? అవి గుంపుగా వుండటము, వాటిని సంరక్షించుకోవటము జీవనపోరాటమే కాక  స్వీయ అస్థిత్వ  అహంకారములో భాగమేనని నా కనిపిస్తుంది. 
'బుద్ధి' అన్నది మాత్రమే కేవలము మానవజాతికే పరిమితమైనది.  బుద్ధి వలన జ్ఞానము, విచక్షణ, ఇంద్రియ నిగ్రహము వృద్ది చెందుతాయి. విషయ పరిజ్ఞానము విచక్షణ కలుగజేస్తుంది.  యుక్తాయుక్త విచక్షణ మనస్సుని ఇంద్రియ ప్రలోభాలను నిగ్రహించెటట్లు చేస్తుంది.  ఇంద్రియ ప్రలోభాలు తత్సుఖాలనుండి మనస్సు విడివడితె అది ప్రశాంతమౌతుంది.  ఆ ప్రశాంతమైన మనస్సు నిశ్చల సరస్సు వలే వుండి పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుంటుంది. నిశ్చలమైన సరస్సులో భూమ్యాకాశాలు, పరిసరాలు ఏ విధంగానైతే స్పష్టంగ ప్రతిబింబిస్తాయో నిశ్చల మనస్సులో కూడ  సర్వాంతర్యామి సాక్షాత్కరిస్తారు.