ఒక్క అడుగు
KCR చేసిన సమగ్ర సర్వే ఆయనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది. అంత ఘనమైన సమగ్ర సర్వే చేసినంక మళ్ళి పిల్లల స్కాలర్షిప్ల గురించి, పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి రకరకా సర్టిఫికెట్లు అడగటము చికాకు కలిగించిన విషయము. సమగ్ర సర్వేలో తెలుసుకున్న విషయలన్నీ రెండు మూడునెలల్లో క్రోడికరించి పరిపాలన సౌలభ్యానికి ఉపయోగించుకుంటమన్నరు. ఆ సర్వే రిపోర్ట్ ఇవ్వలే పేపర్లో వచ్చింది. ఇక ప్రజా అభ్యుదయ పతకాలు ముందుకు పోవటము సులువైతుందనుకుంట.
ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంతమంది భూకబ్జకోరుల మీద కొరడ ఝులిపించినట్టె ఝులిపించి తర్వాత చాల రోజులు ఏమి మాట్లాడలేదు. మళ్ళి మొన్న కబ్జాదారులందారు రెగ్యులరైజేషన్ చేసుకొమ్మని నోటిఫికేషన్ ఇచ్చిన్రు. ఇది ఎవరికి సాయం చేయడానికి? దీని వలన వందల కోట్లు లాభం పొందేది అన్ని ప్రాంతాల పార్టీల నాయకులు, బడా బాబులే కాదా? మళ్ళి దాన్ని కొద్ది రోజులకోసం పక్కకు పెడుతున్నరు. అంటె మరి కొంతమంది బడాబాబులు ఎక్కడైన జాగలుంటె కబ్జచేసుకోవడానికి సమయమిచ్చి ఆ తర్వాత రెగ్యులరైజేషను చేస్తరా ?
తెలంగాణ సాధించిన వ్యక్తిగా KCR పై ప్రజలకు చాల గౌరవమే ఉన్నది. వారి జీవతాలు కాస్తైన కెసిఆర్ పాలనలో బాగుపడ్తయని బండెడు ఆశలు పెట్టుకున్నరు. ప్లాన్ల కలలు వినివిని విసుగొస్తుంది. Ground లెవెల్లో కాస్తైన మార్పు వస్తే అప్పుడు సంబురమైతది.
********************
"Imitation is the best flattery" అంటరు. ఆంధ్ర బాబు చంద్రబాబు నాయుడుకు కొత్త అలోచనలు ఏమి వస్తలేవు. ఇంకా కాంగ్రెసును తిట్టుకుంట గతాన్నే నేమరేస్తూ , వర్తమానంలో కెసిఆర్ పథకాలనే కాపికొడ్తున్నడు. తెలంగాణన్నా, కెసిఆర్ అన్నా చాల అసహనంతో వ్యవహరిస్తున్నడు. ఇది ఒక అనుభవమున్న తెలివైన నాయకుడు చేయాల్సిన పని కాదు. ఇది ముందు ముందు ఎట్లాంటి చిక్కులు తెచ్చిపెడ్తుందో చూడాలి.
***************************
నా చిన్నప్పుడు ఒక కథ చదివాను.
రామయ్య, సోమయ్య ఇద్దరు ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య తెలివైనవాడు. కష్టపడె రకం. సోమయ్య కూడ అన్నిట్లో సమ ఉజ్జీ అయిన ఎప్పుడు రామయ్యతో పోటి పెట్టుకొని ఆయన్ని మించిపోవాలనుకునెవాడు. ఒకసారి ఆ ఊరికి మహిమలుగల మునీశ్వరడు వచ్చాడు. ఆ మహానుభావున్ని ఉళ్ళో ప్రతి ఒక్క కుటుంబము వారి ఇంటికి పిలిచి ఆతిథ్యము ఇచ్చెవారు. రామయ్య, సోమయ్య వంతు వచ్చినప్పుడు సోమయ్య వెళ్లి మునీశ్వరున్ని ముందు తన ఇంటికి రావాల్సిందని ప్రార్థించి తీసుకొచ్చాడు. మునీశ్వరుడు సోమయ్య ఆతిథ్యానికి సంతోషించి ఏమి కావాలో కోరుకోమన్నడు. దానికి సోమయ్య రామయ్య ఏమి కోరుకుంటే దానికి రెండింతలు తనకివ్వమని కోరుకున్నడు. 'తథాస్తు' అని మునీశ్వరుడన్నడు ఆ తర్వాత మునీశ్వరుడు రామయ్య ఇంటికి వెళ్లి అతని ఆతిథ్యము తీసుకున్నడు. రామయ్యను కూడ ఏదైనా కోరిక వుంటె చెప్పితే తీరుస్తని సెలవిచ్చాడు. తన ఇంట్లో నుండి అంతకు ముందె సోమయ్య కోరిక విన్నాడు రామయ్య. సోమయ్యకు గుణపాఠం నేర్పించాలనుకున్నడు. మునీశ్వరుడిని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నడు. మునీశ్వరుడు 'తథాస్తు' అన్నడు. ఆ తర్వాత సోమయ్యకేం అయిందో ఎవరైనా ఊహించవచ్చు.