వరంగల్లు జనాలందరికి లక్నవరము గురించి తెలిసే వుంటుంది. లక్నవరము గ్రామములో లక్నవరము చెరువుంది. లక్నవరము వరంగల్లు నుండి దాదాపు 70 కి.మీ. వుంటుంది. వరంగల్లు నుండి వయా ములుగు రోడ్డు మీదుగా వెళ్ళాలి. బస్సు లేదా స్వంత వాహనమ్ పై వెళ్ళొచ్చు. దారి, ముఖ్యంగా ములుగు దాటినంక చాలా బాగుంటుంది. అటు, ఇటు పొలాలు, చెట్లు, అక్కడక్కడ గుట్టలు, దారమ్మట గొర్రెలు, మేకల మందలు వెళ్ళడం, వాటి ముందు వాటి కాపరులు పోతుంటె ప్రయాణము చాల ఆహ్లాదకరంగా సాగుతుంది.


ములుగు అడవి దారి దాటి వెళ్తుంటె జంగాలపల్లి అనే వూరు వస్తుంది. ఇక్కడ కుడికి తిరిగి మరో ఎనిమిది కి.మీ.లు పోవాలె. ఈ దారేమో సింగల్ రోడ్డు. పరిసరాలు అందమైన చెట్లు పొలాలతో బాగుంటుంది కాని ఎదురుగ వేరె ఏదైన బండి వస్తె తప్పుకుంటు వెళ్లడము కాస్త చికాకైన విషయము. మధ్యలొ వో చోట కల్వర్టు వుంది. ఇక్కడ మరీ కష్టము. నాకైతె అది ఎప్పుడైనా కూలి పోతుందేమొ అనిపించింది. అంతె కాదు. పెద్ద వాన వస్తె మునిగి పోయె అవకాశము కూడ వుంటుందనిపించింది. ఏమో మరి. వరంగల్లు స్మార్ట్ సిటి అవుతుంది, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలనుకుంటునప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళె రోడ్లన్ని బాగు చేసి వెడెల్పు చేయాల్సిన అవసరమెంతైనా వుంది.
లక్నవరము వెళ్లె బండ్లకు పార్కింగ్ స్థలము వున్నది కని సెలవు రోజుల్లొ అది ఎంత మాత్రము సరిపోదు. చెరువుకు ఒక కి.మీ. దూరములోనె వాహనాలను అపెయ్యాలి. ప్రతి చోట వున్నట్టె ఇక్కడ కూడ విఐపిల బండ్లు మాత్రము దగ్గరవరకు వెళ్ళొచ్చు. పర్యావరణ రక్షణ అన్నది వాళ్ళకు వర్తించదు!
పార్కింగ్ స్థలము పక్కనె ఒక చదునైన ప్రదేశము, అక్కడ ఒక గుండ్రటి అరుగు దాని మీద పసుపు రంగు వేసి పైన ఎర్రని గుడ్డ చుట్టిన ఒక చెక్క స్తూపము వుంది. అది గట్టు ముసలయ్య దేవాలయము అని అక్కడ రాసివుంది. ప్రస్తుతానికి అక్కడ గుడిలాగ ఏమి లేదు. ఒక చౌకోటు మాత్రముంది. మరో రెండు మూడేళ్లలో అక్కడ చిన్న దేవాలయము రావచ్చు. లక్నవరము చూడ్డనికి వచ్చిన వాళ్లంత తప్పనిసరిగా అక్కడ దర్శనము తర్వాతె చెరువుకు వెళ్ళాలని చెప్పెవాళ్లు రావచ్చు. ఆ ముసలయ్య ఎవరో, ఆ స్తూపము ఎందుకు పెట్టారో తెలుసికుందామంటె దగ్గరలో నాకెవరు కనబడలేదు.
లక్నవరము సరస్సు విస్తీరణము 108 చదరపు మైళ్ళు. ఇది కాకతీయుల కాలములో, గణపతి దేవ చక్రవర్తి నిర్మించాడు. ఈ సరస్సు గోదావరి ఒక పాయగా భావించబడుతుంది. చుట్టు వున్న అందమైన కొండలతో ఇది ఒక సహజ రిజర్వాయరుగా వుంటుంది. దీని నుండి వచ్చె కుడి ఎడమల కాలువల ద్వారా చుట్టుపక్కల 6-7 గ్రామాలకు రెండు పంటలకు సాగు నీరు అందుతుంది.
ఈ సరస్సు నడుమ అందమైన ౧౬౦ మి. పొడవున్న ఊయల వంతెన వున్నది. వర్షాకాలంలో సరస్సు నిండా నీళ్ళున్నప్పుడు ఈ వంతెన నీళ్ళపైనున్నట్టె వుంటది. సరస్సు మధ్యలో ఈ వంతెన మీద నడవటము వో మరుపురాని అనుభవము. మధ్యలో ఓక ద్వీపము మీద రెస్టారెంటు, ప్రయాణికులకు వసతి గృహాలు వున్నాయి. పిల్లల ఆట స్థలము, పడవ ప్రయాణానికి వసతులు వున్నాయి. ఈ సరస్సులో వున్న మరో ద్వీపము పైన పర్ణశాలలు వున్నాయి. సరస్సు నిండా నీళ్ళు వుంటె ఇవి నీళ్లలో వున్నట్టె అనిపిస్తుంది.
ఈ అందమైన సరస్సు వరంగల్లు పర్యటనకు వచ్చె పర్యాటకులు తప్పని సరిగ చూడాల్సినది. వర్షాకాలములో ఈ సరస్సు అందాలు ఎంతో అద్భుతము.
No comments:
Post a Comment