Wednesday, June 23, 2021

మాస్కు మరువద్దు

 

భయం వద్దు, జాగ్రత్తలు అస్సలే మరువద్దు

ప్రస్తుతానికి లాక్డౌన్ ఎత్తేశారు.  సంతోషమే. మన వీలును బట్టి బైటి పనులు నిమ్మలంగా చేసుకోవచ్చు.  అట్లాగని అవసరమున్నా లేకున్నా బైటకు వెళ్లవద్దు.  కోవిడ్ తగ్గిందే కానీ పూర్తిగా పోలేదు.  అంతె కాక డెల్టా వేరియంట్ అని కోవిడ్ వైరస్ కొత్త రూపం దాల్చిందని, అది మరింత ప్రమాదకారి అని వార్తలు వస్తున్నాయి.  ఎన్ని వాక్సిన్లు తీసుకున్న మాస్కు మర్వొద్దు, భౌతిక దూరం పాటించాల్సిందే.

రాజకీయనాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తరు.  ఎన్ని అబద్ధాలు ఆడైన అధికారంలోకి రావాలనుకుంటరు.  రెన్నెల్ల క్రితం జర్గిన ఎలెక్షన్ల తరువాత దేశంలో ఎన్ని కోవిడ్ మరణాలు జరిగాయో అందరికీ ఎరుక వున్నది కదా.  ఎలక్షన్లు అయ్యాక మళ్ళా లాక్డౌన్ అన్నరు.  ఎలాంటి నిబంధనలు లేకుండా రాష్ట్రములో లాక్డౌన్ ఎత్తివేయడం కోవిడ్ అంతరిచిందని కాదు.  ప్రభుత్వం బాధ్యతను  దులుపుకోవడమే.  త్వరలో రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు తగిన సన్నాహాలు చేసుకునేందుకే.  వెన్నెముకలేని మేధావులు పాలన వ్యవస్థలో వుండి  ప్రజల మేలుకు ఏమి చేయాలో  సలహాలు ఇచ్చే బదులు బాంచను దొర అని కాళ్ళు మొక్కుతు వారి భవిష్యత్తును పదిలం చేసుకుంటున్నారే తప్ప ప్రజల సంక్షేమము పట్టించుకోవట్లేదు.  ప్రజలు వారి కష్టాలు వారు పడాల్సిందే, కోవిడ్ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  

ప్రజలు కోవిడ్ వస్తే  వైద్యం ఏ చికిత్స విధానములో వైద్యము చేసుకుంటున్నారో, ఆ వైద్యవిధానములో మేధావులు ఏమి చెపితే అదే పాటించాలి.  ఇంటింటికి వచ్చి మనిషి మనిషికి కోవిడ్ మందుల పేరుతో మందులు ఇచ్చినా, తమకు వచ్చిన జబ్బు కోవిడ్ అని అనుమానం వస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే.  కోవిడ్ అని అనుమానపడి, కోవిడ్ లేదని రిపోర్టులో వచ్చినవాళ్లు కోవిడ్ ఉత్తదే, అనవసరంగా హంగామా చేస్తున్నారన్న మాటను పట్టించుకోవద్దు.  కోవిడ్ తీవ్రమైన జబ్బు కాకుంటే గడిచిన మూడు నెలల్లో జరిగిన విపరీత మరణాలకు కారణము ఏమిటి?  మరి దీని గురించి పరిశోధన చేయాల్సిన అవసరముంది కదా. 

ఎవరైనా ఏ విద్యలో నిష్ణాతులో, ఏ వృత్తిలో నిష్ణాతులో దాని గురించి మాట్లాడితే జ్ఞానాన్ని పంచినవారువుతారు,  ప్రజలకు మేలు చేసినవారవుతారు.  ఎక్కడో నాలుగు ముక్కలు చదివి, మూడు మాటలు విని దానికి సొంతవ్యాఖ్యానాలు రెండు జోడించి ప్రజలను అయోమయానికి గురిచేయడము మంచిది కాదు.  సొంత గొప్పల కోసం ప్రజల జీవితాలతో చెలగాటము ఆడటము నీతిమాలినతనము, అమానుషం.

లాక్డౌన్ లేకున్నా ప్రజలు, వారికోసం, వారి కుటుంబంకోసం, సమాజ శ్రేయస్సు కోసం జాగ్రత్తలు పాటించాలి.  అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు.  సిన్మాలు, పబ్బులు, రెస్టారెంట్లకు దూరం వుండటము మంచిది.  జబ్బు వచ్చాక ఏ నాయకులు పట్టించుకోరు.  గుంపులుగా తిరుగొద్దు, గుంపులున్న చోటికి వెళ్ళొద్దు.  ఓట్ల రోజు వస్తే ఆ రోజు జాగ్రత్తలు తీసుకుంటు ఓటు వేయడానికి వెళ్లొచ్చు కానీ అనవసరంగా, ప్రచార సభలకు వెళ్ళటము కాని, ప్రచారగుంపుతో తిరుగటము కాని చేయక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.   ఎక్కడికి వెళ్ళినా మాస్కు తప్పనిసరి, భౌతిక దూరం పాటించటము తప్పనిసరి.

ఆరోగ్యమే మహాభాగ్యము.  ఈ సంగతి కుటుంబములో కోవిడ్ వచ్చి, రకరకాలుగా బాధలు పది నష్టపోయిన వారికి బాగానే అర్థమౌతుంది.  ఆరోగ్యమే ఆనందము.



Monday, June 21, 2021

యోగా దినోత్సవం












అన్నీ సమయాల్లో మనస్సు స్థిరంగా సమత్వముతో ఉండటమే యోగం.  మనస్సు పరమాత్మలో లీనమవటము యోగం.  జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటము యోగం.

Tuesday, June 1, 2021

ఉచితం అనుచితం

 

కోవిడ్-19 ప్రపంచములో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.  ఇది మొదలై ఏడాదిన్నర అవుతున్న ఇంకా అంతా కొత్తనే, అయోమయమే.  ఎట్లా మొదలైంది, ఎవరికి వస్తుంది, శరీరంలో ఎట్లాంటి మార్పులు తెస్తుంది, ఎన్ని తిప్పలు పెడుతుంది దీని గురుంచి ప్రతిరోజూ రకరకలా మాధ్యమాల ద్వారా జనం తెల్సుకుంటున్నారు.  వైద్యులు వారు చికిత్స చేస్తున్నవారీలో లక్షణాలు, అవి ఎందుకు వచ్చాయన్న విశ్లేషణలు, అనుకున్నలేదా నిర్ధారణకు వచ్చిన కారణాన్ని బట్టి ఏమి మందులు ఎంత మోతాదులో వాడితే బాగుంటుందో అన్నది వారి వారి ప్రత్యేక సంఘాలలో తెలియచేసుకుంటూ, ఒకరికొకరు సలహాలిచ్చుకుంటూ జబ్బును త్వరితగతిన నయంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఒక స్థాయిలో అర్థము చేసుకునే విషయాలను కొంతమంది సామాన్యులకు కూడా ఉదారంగా చేరవేస్తున్నారు.  దీనివలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి.  ఏ వృత్తిలోనైనా వుండే మెళుకువలు, కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఆ వృత్తి చేసేవారికే అర్థం అవుతాయి.  నాలుగు మందుల పేర్లు తెలిసినంత మాత్రాన వైద్యం అంతా వచ్చనుకునే వాళ్ళకు ఏమిచెపితే ఏమి అర్థమౌతుంది?  కంచంలోకి అన్నం ఎట్లా వస్తుందంటే గిన్నెలో అన్నం వడ్డించుకుంటే సరి అన్నట్టుంది.

కోవిడ్-19 వచ్చినప్పటినుండి ముందు ఒక మందు పనిచేస్తుందని, తర్వాత అది కాదు వేరే వాడాలని మారుతూ వస్తుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే ఇంతవరకు వాడిన ఏ మందైన వైరస్ ఉదృతిని తగ్గిస్తుందే తప్పే శరీరంలో దానిని చంపే మందు ఇప్పటికైతే లేదు.  (ముందు ముందు వస్తుందని ఆశిద్దాము).  చాలా వరకు కోవిడ్ చికిత్స ఆ జబ్బు వల్ల వచ్చే లక్షణాలనుండి ఉపశమనము కలిగించేవి మాత్రమే.  కోవిడ్-19 అన్నీ రక్త నాళాలపైన, అన్నీఅవయవాలమీద ప్రభావము చూపిస్తున్నా, అత్యధికంగా దాని ప్రభావము ఊపిరితిత్తుల మీద వుంటుంది. శ్వాస ప్రక్రియ ద్వారా గాలి ఊపిరితితుల్లోకి పోయినప్పడు అక్కడ రక్తనాళల్లోకి ప్రాణవాయువు ఆక్సిజన్ పోయి, రక్తనాళల్లో వున్న కార్బండైయాక్సైడ్ ఊపిరితిత్తుల్లో  ప్రవేశించి బయిటకు వదలబడుతుంది.  వైరస్ వల్ల ఊపిరితిత్తుల్లో వివిధ మార్పుల వల్ల అవి అట్టల్ల (గట్టిగ) అయి వ్యాకోచించి,సంకోచించే గుణాన్ని కోల్పోయి వాయు మార్పిడి జరగకుండా ఆగిపోతుంది.  ఊపిరితిత్తులో జరిగే ఈ మార్పులు ఎంత తక్కువ కాలంలో జరిగాయి, ఎంత ఎక్కువ భాగాన్ని నాశనం చేశాయి అన్నదాని మీద ఆధారపడి రోగి కోలుకోవడము, కోలుకోక పోవడము జరుగుతుంది.  మరి ఇక్కడ డాక్టర్లు ఏమి చేస్తారనే ప్రశ్న.  ఆక్సిజన్ వారికి కావల్సిన మోతాదులో ఇవ్వడమే.  అంతే కాకుండా ఆ పరిస్థితిలో శరీరంలో జరిగే మార్పుల ఉధృతి తగ్గించడానికి, శరీర వ్యవస్థలో మరే తీవ్ర మార్పులు రాకుండా వుండటానికి మందులు ఇవ్వటము జరుగుతుంది.  ఒక జబ్బుకు, శరీరమార్పులకు, ఇచ్చే మందులకు వారి శరీరజీవ ప్రక్రియ ఎట్లా ప్రతిస్పందిస్తది అన్నది ఆ వ్యక్తి మానసిక-శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి వుంటుంది.  కొన్ని జన్యు పరమైన అంశాలు కూడా చికిత్సకు  ప్రతిస్పంద విపరీతంగా వుండవచ్చు.  ఆరోగ్యానికి పాలు ఎంతో మంచివంటాము.  కానీ పాలు పడని వారు కూడా వుంటారు.  

ప్రతి ఒక్కరు వారి వృత్తి నిబద్ధతో చేయాలని, పేరుతెచ్చుకోవాలని అనుకుంటారు.  వారి వృత్తి వారి జీవనాధారము, వారి కీర్తి, వారి ఐశ్వర్యము.  ఎవరైనా ఏదైనా చేసే పని బాగా చేసి గొప్ప చెప్పుకోవాలనుకుంటారా లేక పని పాడు చేసి తిట్లు శాపనార్థాలు తెచ్చుకోవాలని అనుకుంటారా?

ఒక MBBS డాక్టర్ కావాలంటే పదిహేను ఏళ్లనుండే అతిశ్రద్ధగా చదవాలి.  PG చేయాలి, ఆపై మరో స్పెషాలిటీ చేయాలంటే, సక్రమంగా అన్నీ పరీక్షలు క్రమము తప్పకుండ కావడమే కాదు, ఎక్కడ తప్పకుండ ముందుకు వెళితే 12-14 సంవత్సరాలు పడుతుంది.  అంటే ఒక వ్యక్తి స్పెషాలిటీ డాక్టర్ అయ్యేవరకు 30సంవత్సరాలు నెత్తిమీదికి వస్తాయి.  ప్రాక్టీసులో స్థిరపడడానికి మరో అయిదేళ్లు.  ఇప్పడికే సగం జీవితము అయిపోయిందికదా!  ఒక మనిషిని చంపాలనుకుంటే ఇన్ని ఏండ్లు కష్టపడాల్సిన అవసరము వుందా?   నాలుగు మందుల పేర్లు, పదో తరగతిలో అతి కష్టంగా గట్టెక్కి, వో రెండేళ్ళు దవాఖానలో పనిచేస్తే వైద్యం చేయవస్తే, గూగుల్ సెర్చ్లో  లక్షణాలు కొట్టి జబ్బెంటో, చికిత్స ఏంటో తెలుస్కో గల్గిన ఈ రోజుల్లో, రాత్రి పగలు కష్టపడి ఎంట్రెన్సులో సీటు కోసం కష్టపడటము, లాంగ్టర్మ్  కోచింగ్లకు వెళ్ళటము, ఆ తరువాత ఏండ్ల కొద్ది ఆకర్షణలన్ని పక్కనబెట్టి రాత్రి పగలు చదవటం పిచ్చి అని అనుకోవాలి.

ఏ వైద్య విద్యా నాలుగు రోజుల్లో, నెలల్లో వచ్చేది కాదు.  అన్నీ రకాల వైద్యాలు అందరికీ అందుబాటులో వుండాల్సిందే.  కాకపోతే ఎవరు ఏ వైద్యములో నిష్ణాతులైతే అదే చేయాలి.  అప్పుడే రోగికి న్యాయం జరుగుతుంది.  చదివింది ఒకటి చేసెది ఒకటైతే వారు చదివిన విద్య పట్ల వారికే గౌరవము, నమ్మకము లేదని అనుకోవాలి.  నమ్మకము లేని వైద్యము, తెలియని వైద్యము చేయటము నేరము కాదా?

జనాలైనా ఏ వైద్యాన్ని నమ్మితే అదే వాడాలి.  అన్నింటిని ఒకేసారి వాడి కొత్త సమస్యలు సృష్టించుకోవద్దు.  ఉచితంగా వచ్చినంత మాత్రాన ఏది పడితే అది తింటామా?   కష్టం వున్నప్పుడు తొందర పడకుండా హేతుబద్ధతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరము వుంటుంది. మన అవసరాలు బట్టి ఆ రంగములో నిపుణుల సలహా తీసుకోవటము చేస్తే జీవితము సాఫీగా సాగుతుంది.

న త్వహమ్ కామయే రాజ్యమ్

న స్వర్గమ్ నాపునర్భవమ్

కామయే దుఃఖతప్తనామ్

ప్రాణినామ్ ఆర్తినాశనమ్