Wednesday, June 23, 2021

మాస్కు మరువద్దు

 

భయం వద్దు, జాగ్రత్తలు అస్సలే మరువద్దు

ప్రస్తుతానికి లాక్డౌన్ ఎత్తేశారు.  సంతోషమే. మన వీలును బట్టి బైటి పనులు నిమ్మలంగా చేసుకోవచ్చు.  అట్లాగని అవసరమున్నా లేకున్నా బైటకు వెళ్లవద్దు.  కోవిడ్ తగ్గిందే కానీ పూర్తిగా పోలేదు.  అంతె కాక డెల్టా వేరియంట్ అని కోవిడ్ వైరస్ కొత్త రూపం దాల్చిందని, అది మరింత ప్రమాదకారి అని వార్తలు వస్తున్నాయి.  ఎన్ని వాక్సిన్లు తీసుకున్న మాస్కు మర్వొద్దు, భౌతిక దూరం పాటించాల్సిందే.

రాజకీయనాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తరు.  ఎన్ని అబద్ధాలు ఆడైన అధికారంలోకి రావాలనుకుంటరు.  రెన్నెల్ల క్రితం జర్గిన ఎలెక్షన్ల తరువాత దేశంలో ఎన్ని కోవిడ్ మరణాలు జరిగాయో అందరికీ ఎరుక వున్నది కదా.  ఎలక్షన్లు అయ్యాక మళ్ళా లాక్డౌన్ అన్నరు.  ఎలాంటి నిబంధనలు లేకుండా రాష్ట్రములో లాక్డౌన్ ఎత్తివేయడం కోవిడ్ అంతరిచిందని కాదు.  ప్రభుత్వం బాధ్యతను  దులుపుకోవడమే.  త్వరలో రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు తగిన సన్నాహాలు చేసుకునేందుకే.  వెన్నెముకలేని మేధావులు పాలన వ్యవస్థలో వుండి  ప్రజల మేలుకు ఏమి చేయాలో  సలహాలు ఇచ్చే బదులు బాంచను దొర అని కాళ్ళు మొక్కుతు వారి భవిష్యత్తును పదిలం చేసుకుంటున్నారే తప్ప ప్రజల సంక్షేమము పట్టించుకోవట్లేదు.  ప్రజలు వారి కష్టాలు వారు పడాల్సిందే, కోవిడ్ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  

ప్రజలు కోవిడ్ వస్తే  వైద్యం ఏ చికిత్స విధానములో వైద్యము చేసుకుంటున్నారో, ఆ వైద్యవిధానములో మేధావులు ఏమి చెపితే అదే పాటించాలి.  ఇంటింటికి వచ్చి మనిషి మనిషికి కోవిడ్ మందుల పేరుతో మందులు ఇచ్చినా, తమకు వచ్చిన జబ్బు కోవిడ్ అని అనుమానం వస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే.  కోవిడ్ అని అనుమానపడి, కోవిడ్ లేదని రిపోర్టులో వచ్చినవాళ్లు కోవిడ్ ఉత్తదే, అనవసరంగా హంగామా చేస్తున్నారన్న మాటను పట్టించుకోవద్దు.  కోవిడ్ తీవ్రమైన జబ్బు కాకుంటే గడిచిన మూడు నెలల్లో జరిగిన విపరీత మరణాలకు కారణము ఏమిటి?  మరి దీని గురించి పరిశోధన చేయాల్సిన అవసరముంది కదా. 

ఎవరైనా ఏ విద్యలో నిష్ణాతులో, ఏ వృత్తిలో నిష్ణాతులో దాని గురించి మాట్లాడితే జ్ఞానాన్ని పంచినవారువుతారు,  ప్రజలకు మేలు చేసినవారవుతారు.  ఎక్కడో నాలుగు ముక్కలు చదివి, మూడు మాటలు విని దానికి సొంతవ్యాఖ్యానాలు రెండు జోడించి ప్రజలను అయోమయానికి గురిచేయడము మంచిది కాదు.  సొంత గొప్పల కోసం ప్రజల జీవితాలతో చెలగాటము ఆడటము నీతిమాలినతనము, అమానుషం.

లాక్డౌన్ లేకున్నా ప్రజలు, వారికోసం, వారి కుటుంబంకోసం, సమాజ శ్రేయస్సు కోసం జాగ్రత్తలు పాటించాలి.  అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు.  సిన్మాలు, పబ్బులు, రెస్టారెంట్లకు దూరం వుండటము మంచిది.  జబ్బు వచ్చాక ఏ నాయకులు పట్టించుకోరు.  గుంపులుగా తిరుగొద్దు, గుంపులున్న చోటికి వెళ్ళొద్దు.  ఓట్ల రోజు వస్తే ఆ రోజు జాగ్రత్తలు తీసుకుంటు ఓటు వేయడానికి వెళ్లొచ్చు కానీ అనవసరంగా, ప్రచార సభలకు వెళ్ళటము కాని, ప్రచారగుంపుతో తిరుగటము కాని చేయక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.   ఎక్కడికి వెళ్ళినా మాస్కు తప్పనిసరి, భౌతిక దూరం పాటించటము తప్పనిసరి.

ఆరోగ్యమే మహాభాగ్యము.  ఈ సంగతి కుటుంబములో కోవిడ్ వచ్చి, రకరకాలుగా బాధలు పది నష్టపోయిన వారికి బాగానే అర్థమౌతుంది.  ఆరోగ్యమే ఆనందము.



No comments:

Post a Comment