Sunday, July 6, 2025

స్థైర్యం

 











మైదానములో మహావృక్షం

మోడువారినా కుంగలేదు

బలమైన వేళ్ళతో

నిలిచింది నిటారుగా

 

ఆకాశాన్నంటే కొమ్మలతో

పలకరించింది మబ్బులని

మురిసిన మబ్బులు

కురిసెను చిరుజల్లులు

 

ఆనందంగా వృక్షం

చిగురించింది మళ్ళీ

విరిబోణులతో వికసించి

ప్రకృతికి అందాలు పంచింది



Sunday, June 8, 2025

ఊసరవెల్లి

 

ఊసరవెల్లి

రంగురంగుల ఊసరవెల్లి

రంగులు మార్చే ఊసరవెల్లి

కొమ్మల నడుమ నీవు

కదలక మెదలక కూర్చునేవు


 చక్రాల్లాంటి కళ్ళతో  

చుట్టూ చుట్టూ చూసీవు

అల్లంత దూరాన్న కీటకాన్ని

టక్కున నాలుకతో కొట్టేవు

గుటుక్కున మింగి

మళ్ళీ వేటకు సిద్ధం నీవు

 
పై చిత్రం ఏ‌ఐ(AI) సృష్టి

Friday, June 7, 2024

గెలుపోటములు

 


సామాన్యంగా గెలుపోటములు దైవాధీనములని అంటారు.  ప్రజాస్వామ్యములో ఎన్నికల్లో అవి ప్రజాధీనాలు.  ముఖ్యంగా పల్లె ప్రజలు, వెనుకబడిన వారి ఆధీనమనుకుంట.  దైవము దీనబంధు కదా!  ఎవరు ఎన్ని చెప్పినా, ఉచితాలు ఇచ్చినా, వారి స్వంతం చేసుకున్న అన్ని మీడియాల ద్వారా ఎంత ప్రచారము చేసినా అట్టడుగున వున్న ప్రజలు,  - అంతవరకు నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసిన ఏమి చేయలేక భరించిన ప్రజలు, దీనులు, హీనులు,-  ఓటు అనే ఆయుధాన్ని సగర్వంగా వినియోగించి సాక్షాత్తు భగవంతుని అవతారము అని అహంకారము ప్రదర్శించే నాయకులకు వారి స్థానాన్ని తెలియచేస్తారు.   చదువుకున్నా, నిరక్షరాస్యులైన, ఏ కులానికి వర్గానికి చెందినా యుక్తవయస్కులైన భారతీయులందరికి ఓటు హక్కును కల్పించిన మన రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రదాతకు మనమంతా శిరస్సు వంచి నమస్కారిచాల్సిందే.

ప్రజలు ఎడ్డివారూ, గుడ్డివారు కాదు. వారు ప్రతిరోజూ జీవిస్తూ వారి స్థితి సమాజ స్థితి గమనిస్తూ ముందుకుపోతుంటారు. దానికి చదువు అవసరము లేదు. తెలివి వుంటే చాలు.  వారి నాయకుడు ఎన్నికైనప్పటినుండి వారి స్థానానికి, అక్కడి ప్రజలకు ఏమి చేస్తున్నాడో చూస్తూనేవుంటారు, తెల్సుకుంటూనేవుంటారు.  ప్రజలపట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అందరికీ తెలిసిపోతూనే వుంటుంది.  అంతా బహిరంగ రహస్యమే.  గెలిచిన నాయకులు, స్థానికంగా ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడానికి కాస్తైనా పనిచేస్తే ఆ నాయకుడిని పార్టీలకతీతంగా మళ్ళీ ఎన్నికునే అవకాశము ఎక్కువ. 

గెలిచిన నాయకులకు పదితరాలకు సరిపడే ఆస్తి సంపాదించిపెట్టుకోవాలనే ఆలోచన కాకుండా  తన స్థానిక ప్రజల జీవితాలు కొంతైనా బాగుపడాలని నిజాయతిగా ప్రయత్నిస్తే, సహకరిస్తే అ నాయకుడిని ప్రజలు మరుస్తరా? మళ్ళీ అడగకుండానే ఓటు వేసి గెలిపించరా?

  

Saturday, June 1, 2024

మార్పు

 


తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నరు. తెచ్చుకున్నరు.  ప్రభుత్వము మార్పుతో, ఇచ్చిన గ్యారంటీల అమలుతో స్త్రీలు లాభము పొందుతున్నారు.  కొన్ని పేద కుటుంబాలు కూడా లబ్ధి పొందుతున్నాయి.  ఇంకా పూర్తి చేయాల్సిన గ్యారంటీలు త్వరలోనే అమలు అయితాయని అంటున్నరు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినంక పరిస్థితులు ఎలావుంటాయో వేచి చూడాలిమరి.

ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఒక దశాబ్ది అయింది.  కొత్త ప్రభుత్వం వచ్చినంక బయటపడుతున్న విషయాలు వింటుంటే, చూస్తుంటే తలతిరిగి పోతుంది.  నాకు తెల్సి ఒకరు అంటుంటారు, జో తెలంగాణ లాయ వో తెలంగాణ ఖాయ”.  చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే ఘనుడు ఎంతమంది యువత తెలంగాణ కోసం ఆత్మత్యాగలు చేశారు, తెలంగాణలో అన్ని వర్గాల వారు ఎన్నిరకాలుగా  సమ్మేచేశారో, రోడ్లుఎక్కి కేసుల్లో ఇరుక్కున్నారో, ఎంతమంది మేధావులు వెంటవుండి అన్ని వర్గాల వారిని కూడగట్టుకొని నడిపిస్తే తెలంగాణ కల సాకారమయిందో మర్చిపోయిండు.  తానే రాజనుకున్నడా దొర.  తెలంగాణ తన జాగీరు అన్నట్టు మేదిలిండు. కోట్లు కోట్లు దోచుకున్నడు.  ఈ దొరకు ప్రజాస్వామ్యములో వుండాల్సిన స్థానమేంటి?  ప్రజలు నిర్ణయిస్తరు.  నిర్ణయించారు.

దశాబ్ది కాలములో కాలానుసారంగా కొన్ని మార్పులు వచ్చాయి.  కొత్త రాష్ట్రానికి కొన్ని మార్పులు వచ్చాయి.  రాష్ట్రగీతం మాత్రము రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వము రాష్ట్రగీతాన్ని రేపు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరించటము చాలా సంతోషించాల్సిన విషయము.  తెలంగాణ ఉద్యమములో అందరినీ ఉత్సాహపరిచి గుండెలు ఉప్పొంచిన గీతం. ఇప్పుడు కూడా తెలంగాణ వారి గుండెల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపే గీతము.

కొత్తగా తెలంగాణ రాజముద్ర వస్తుందని అంటున్నరు.  ప్రభుత్వాలు మారినప్పుడంతా కొత్త రాజముద్రలు వస్తాయంటే కష్టమనుకుంట.  రాష్ట్రము ఏర్పడిన కొత్తలో కొన్ని పోరపాట్లు జర్గివుండొచ్చు.  నాటి ముఖ్యమంత్రి నియంతలాగా, లోకంలో తానే ఏకైక మేధావిలాగా ఏకపక్షనిర్ణయాలు తీసుకున్నారు కూడా.  అందులో ఓరుగల్లు వాసులకు అస్సలే నచ్చని విషయము వరంగల్లును ముక్కలు చేయటము. ఓరుగల్లు, పోరుగల్లు పిడికిలి బిగిస్తే ఎప్పటికైనా విజయభేరి మొగవలసిందే.  అందుకని దీన్ని ముక్కలు చేసి ఆ పిడికిలి బిగించే శక్తి తీసివేయాలనుకున్నడేమో ఆ రాజకీయనాయకుడు.  తనకు ఏ ప్రజాశక్తి ఎదురు తిరుగకూడదని పోరుగల్లుని ముక్కలు చేశాడు. 

ఓరుగల్లు కాకతీయ తోరణము ఒక రాచరికపు ఆనవాలు మాత్రమే కాదు.  కాకతీయ సామ్రాజ్యము అనగానే గుర్తుకువచ్చేది నారీ శక్తి, రాణి రుద్రమదేవినే కాదు సమ్మక్క సారలమ్మ పోరాటశక్తి.  కాకతీయులు ప్రజాభివృద్ధికై ప్రతి ఊరికి గుడులు కట్టటమే కాదు చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు.  తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్థూపం ఎంత ముఖ్యమో కాకతీయ తోరణము చారిత్రాత్మకంగా అంతే ముఖ్యమని నా భావనా.  అధికారములో వున్నవారు సామాన్యుల మాటలు పట్టించుకుంటారా? 

ప్రజాస్వామ్యములో సామాన్యులే అధికారములో ఎవరు వుండాలో నిర్ణయిస్తరు.

అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

Monday, May 13, 2024

గెలుపు ఎవరిదో

 


తెలంగాణలో ఇవ్వాళ సార్వత్రిక ఎన్నికలు.  ప్రజలందరు ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నరు.  పల్లెలో ఓటు వుండి పట్టణాల్లో నివసిస్తున్న జనాలు నిన్నటి నుండే ఊర్లకు వెళ్ళటము  మొదలు పెట్టారు.  సామాన్యంగా పట్టణాల్లో వుండే చదువుకున్న వాళ్ళు  ఎందుకో మరి ఓటు వేయటములో శ్రద్ధ చూపరనిపిస్తుంది.  ఎప్పుడు కూడా పల్లెల్లో ఓటింగ్ శాతము ఎక్కువగా, పట్టణాల్లో తక్కువగా వుంటుంది.  పట్టణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఓటింగా చాలా తక్కువగా వుంటుంది.  అక్కడ వలస వచ్చినవారు ఎక్కువ కాబట్టి వారికి శ్రద్ధ వుండదనుకుంట.  లేకపోతే ఎవరు గెలిచినా వారి జీవితములో పెద్ద మార్పు ఏమి వుండదనే నిరాశనా? 

పల్లెల్లో ఓట్ల పండగ అంటే సంబరమే.  ప్రచారములో పాలుగొనటము, దానివల్ల కొంత ఆదాయము పొందటము, ఓటుకు ఎంతో కొంత డబ్బు లేదా మరేదైనా లాభము పొందటము సామాన్యంగా జరుగుతుంది.  పల్లెలో వుండేది ఎక్కువగా రైతులు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు.  పేదరికము ఎక్కువే. అందువల్ల  ప్రభుత్వ పాలసీల వల్ల కలిగే లబ్ది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది.  పల్లె ప్రజల్లో పైకి కనిపించక పోయిన రాజకీయ చైతన్యము ఎక్కువ అని నాకనిపిస్తది. పట్టణాల్లో ఓటింగి సరళికి  భిన్నంగా పల్లె ఓటింగ్ వుంటుంది. 

నెట్ అందరికీ అందుబాటులో వుంటుంది.  సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్నీ- అసలు, ఫెకు వార్తులు, వీడియోలు అందరు చూస్తున్నరు.  వాస్తవ పరిస్థితులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయలలో వాస్తవస్తావాలు, కనిపించేదానికి చూపేవాటికి వ్యత్యాసాలు ప్రజలు తెలుసుకొని ఓటు ఎవరికి వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మరో మూడు వారాలకు తెలిసిపోతుంది.  

వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారా లేక పార్టీ పాలసీలకు ఓట్లు పడతాయ వేచి చూడాలి.

 

Saturday, May 11, 2024

నీవు నేర్పిన విద్యయే

 


ఇవాల్టితో ఎలెక్షన్ ప్రచారము ముగుస్తుంది. ఇక ప్రజలకు నాయకుల విపరీతమైన మాటలు వినే అవస్థ వుండదు. ఈ పదిహేను రోజులు అన్నీ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు బురుద చల్లుకోవడము, ఒకరు మాట్లాడినదాంట్లో విపరీతార్థాలు తీసి మాట్లాడటము బంద్ అవుతుంది.  జాతీయ పార్టీలు వాళ్ళ పార్టీ అధికారములోకి వస్తే దేశములో ఏమి చేస్తుందో, రాష్ట్రానికి ఏమి ఇస్తుందో చెప్పకపోవడము దురదృష్టము.  అద్భుతాలు చేస్తమంటారుకాని అది ఏంటో చెప్పారు.  మొత్తానికి అన్నీ పార్టీలు వారి పార్టీ కాక వేరే పార్టీని ఎన్నుకుంటే ఇక దేశములో సామాన్యుని మనుగడకు ముప్పని భయపెట్టినాయి.  ఎప్పుడైనా ఏ పార్టీ ఎన్నికైనా సామాన్యుని బతుక ఏమైనా మరిందా, పేదరికము తగ్గిందా, జీవన ప్రమాణము ఏమైనా పెరిగిందా?  పెద్దవారికి బేలౌట్లు, పేద, మధ్యతరగతి వారికి బెల్టుటైట్లు.  నా దేశము, రాష్ట్రమూ ధనికమైనవే.  అయినా రైతు మరణాలు, ఆకలి మరణాలు మాత్రము అవుతూనేవున్నాయి.

ప్రచారము ముగిసినంత మాత్రాన ఇక పార్టీలన్నీ విశ్రాంతిగా వుంటాయని కాదు.  ఇప్పుడు తమ పార్టీకే వోటు వేయడానికి ప్రలోభాల పెట్టె కార్యక్రమము షురూ అవుతుంది.  వొట్లకు ఒకటి-రెండు రోజుల ముందే అంతా వారి వారి సొంతూరికి చేరుకుంటరు.  ఊర్లల్లో, పట్టణాలలో కొన్నికొన్ని ఏరేయాలలో పంపకాలు మొదలు అయితాయి.  ఆడ, మొగా, ఓటు కింతా అని డబ్బు పంపకాలు, డ్రింక్ వంటివి అందివబడుతాయి.  ఇదివరకే నాయకులంతా ఎవరెంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రము మాకే వేయండి అని అన్నారు కాబట్టి పేద ప్రజలు కూడా మొహమాటము లేకుండా డబ్బు తీసుకుంటరు.  తీసుకోకపోతే నాయకులకు అనుమానము  మాకు ఓటు వేయవా అని నిలదీస్తారు కూడా.  ఆ భయానికి కూడా డబ్బు, ఇంకా ఏమైనా ఇస్తే అదీ తీసుకుంటరు.  తర్వాత వారికి నచ్చిన వారికి వోటు వేస్తరు.  కుటుంబములో నలుగురు వుంటే నచ్చిన వారికి ఓ ఓటు ఎక్కువ మరొకరికి ఒకటి తక్కువ పడుతుంది.  డబ్బు తీసుకున్నందుకు ఇచ్చిన వాడికి ఎంతో కొంత న్యాయము చేయాలనుకుంటరు.  ఈ మాత్రము నిజాయితీ నాయకులకు వుంటే దేశము ఎంతో ముందికు పోయెదనుకుంట.

ప్రజా నిర్ణయము ఎలావుంటోందో వేచి చూడాలి మరి.

 

Wednesday, May 8, 2024

నుయ్యా? గొయ్యా?

 


తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారము జోరుగా జరుగుతుంది.  ప్రతీ పార్టీ ప్రత్యర్థి పార్టీని దుమెత్తి పోయటమే.  అది వింటే కాస్త ఆలోచన శక్తి వున్నవారికి ఏ పార్టీకి వోటువేయాలన్న భయమేస్తుంది. 

ఒకప్పుడు ఏ పార్టీకి ఎవరితో పొత్తో బహిరంగంగా తెలిసేది.  ఇప్పుడు అసలే అర్థం కాకుండా వున్నది.  తెలంగాణలో ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు జాతీయ పార్టీలుగా చెప్పుకోదగ్గవి రెండే.  కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అయిన ఆ పార్టీ ఎప్పుడు  వేరే రాష్ట్ర, లేదా జాతీయపార్టీ భుజాన ఎక్కి కానీ పోటీ చేసింది లేదు.  లోకలు గా వుండి జాతీయంగా ఎదగలనుకునేవి మరో రెండు పార్టీలు వున్నాయి.  ఒకటి ఇక్కడ హైదరాబాదుకే పరిమితం. ఇకపోతే తెరాస/భారాస.  తెరాసగా వున్నప్పుడు అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ప్రజలు దాన్ని గుర్తించి బాగా ఆదరించినరు.  అదికాస్త భారాసగా మార్చబడ్డాక తెలంగాణ ప్రజలకు అది మరొక కొత్త పార్టీ అయింది కానీ అది తెలంగాణ ఆస్టిత్వ పార్టీగా మారలేక పోయింది.  అంతేకాక పార్టీ నాయకుల వేషాలు, మోసాలు తెలిసినంక భారాస తెలంగాణ ప్రజలకు భారంగా అయింది.  అందుకే మార్పు మొదలైంది.

ఇప్పుడు ప్రచారములో రెండు జాతీయ పార్టీలు కూడా భారాస ప్రత్యర్థి పార్టీకి మద్దత్తు అని ప్రచారము చేస్తున్నాయి.  భారాస కూడా రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.  తెరవెనుక భాగోతాల సంగతి ఆ ఆ పార్టీ నాయకులకే తెలుసు.  

ఈ తికమకలే కాక ప్రజలకు మరో కొత్త సమస్య.  అది ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియట్లేదు.  ఇవ్వాళ పొద్దుట ఒక పార్టీలో వుంటే రేపు ఏ కండువా కప్పుకొని కనిపిస్తాడో తెలుస్తలేదు.  నాయకలకు విలువలు లేవు. సరే.  కానీ ప్రజలు చాలావరకు అట్లా లేరు కదా!  వారి జంపింగులను ప్రజలు అసహ్యిచుకుంటున్నరు.  ఒక్కరోజులోనే ఆ ఆ నాయకుల తిట్ల ప్రవచనాలు మారిపోతున్నాయి. నిన్నటి ఉత్తమోత్తమ నాయకుడు ఇవ్వాళ ప్రజకంటకుడౌతున్నడు.  ప్రజలకు ఒక విషయము మాత్రము స్పష్టంగా అర్థమైంది నాయకులు పనిచేసేది, పార్టీ మారేది ప్రజాసంక్షేమము కోసం కాదు, వారు అధికారములో వుండే కోసం, వారి ఆస్తులు కాపాడుకోవటము మరియు పెంచుకోవటముకోసమే.

నాయకులంతా స్వార్థపరులే అని అర్థమైనంక ఎవరిని ఎన్నుకోవాలి?  ఎవడికి దోచుకునే అవకాశము ఇవ్వాలి?  ఇదీ ఇప్పుడు  ఆలోచించాల్సిన విషయము.