Monday, May 13, 2024

గెలుపు ఎవరిదో

 


తెలంగాణలో ఇవ్వాళ సార్వత్రిక ఎన్నికలు.  ప్రజలందరు ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నరు.  పల్లెలో ఓటు వుండి పట్టణాల్లో నివసిస్తున్న జనాలు నిన్నటి నుండే ఊర్లకు వెళ్ళటము  మొదలు పెట్టారు.  సామాన్యంగా పట్టణాల్లో వుండే చదువుకున్న వాళ్ళు  ఎందుకో మరి ఓటు వేయటములో శ్రద్ధ చూపరనిపిస్తుంది.  ఎప్పుడు కూడా పల్లెల్లో ఓటింగ్ శాతము ఎక్కువగా, పట్టణాల్లో తక్కువగా వుంటుంది.  పట్టణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఓటింగా చాలా తక్కువగా వుంటుంది.  అక్కడ వలస వచ్చినవారు ఎక్కువ కాబట్టి వారికి శ్రద్ధ వుండదనుకుంట.  లేకపోతే ఎవరు గెలిచినా వారి జీవితములో పెద్ద మార్పు ఏమి వుండదనే నిరాశనా? 

పల్లెల్లో ఓట్ల పండగ అంటే సంబరమే.  ప్రచారములో పాలుగొనటము, దానివల్ల కొంత ఆదాయము పొందటము, ఓటుకు ఎంతో కొంత డబ్బు లేదా మరేదైనా లాభము పొందటము సామాన్యంగా జరుగుతుంది.  పల్లెలో వుండేది ఎక్కువగా రైతులు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు.  పేదరికము ఎక్కువే. అందువల్ల  ప్రభుత్వ పాలసీల వల్ల కలిగే లబ్ది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది.  పల్లె ప్రజల్లో పైకి కనిపించక పోయిన రాజకీయ చైతన్యము ఎక్కువ అని నాకనిపిస్తది. పట్టణాల్లో ఓటింగి సరళికి  భిన్నంగా పల్లె ఓటింగ్ వుంటుంది. 

నెట్ అందరికీ అందుబాటులో వుంటుంది.  సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్నీ- అసలు, ఫెకు వార్తులు, వీడియోలు అందరు చూస్తున్నరు.  వాస్తవ పరిస్థితులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయలలో వాస్తవస్తావాలు, కనిపించేదానికి చూపేవాటికి వ్యత్యాసాలు ప్రజలు తెలుసుకొని ఓటు ఎవరికి వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మరో మూడు వారాలకు తెలిసిపోతుంది.  

వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారా లేక పార్టీ పాలసీలకు ఓట్లు పడతాయ వేచి చూడాలి.

 

Saturday, May 11, 2024

నీవు నేర్పిన విద్యయే

 


ఇవాల్టితో ఎలెక్షన్ ప్రచారము ముగుస్తుంది. ఇక ప్రజలకు నాయకుల విపరీతమైన మాటలు వినే అవస్థ వుండదు. ఈ పదిహేను రోజులు అన్నీ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు బురుద చల్లుకోవడము, ఒకరు మాట్లాడినదాంట్లో విపరీతార్థాలు తీసి మాట్లాడటము బంద్ అవుతుంది.  జాతీయ పార్టీలు వాళ్ళ పార్టీ అధికారములోకి వస్తే దేశములో ఏమి చేస్తుందో, రాష్ట్రానికి ఏమి ఇస్తుందో చెప్పకపోవడము దురదృష్టము.  అద్భుతాలు చేస్తమంటారుకాని అది ఏంటో చెప్పారు.  మొత్తానికి అన్నీ పార్టీలు వారి పార్టీ కాక వేరే పార్టీని ఎన్నుకుంటే ఇక దేశములో సామాన్యుని మనుగడకు ముప్పని భయపెట్టినాయి.  ఎప్పుడైనా ఏ పార్టీ ఎన్నికైనా సామాన్యుని బతుక ఏమైనా మరిందా, పేదరికము తగ్గిందా, జీవన ప్రమాణము ఏమైనా పెరిగిందా?  పెద్దవారికి బేలౌట్లు, పేద, మధ్యతరగతి వారికి బెల్టుటైట్లు.  నా దేశము, రాష్ట్రమూ ధనికమైనవే.  అయినా రైతు మరణాలు, ఆకలి మరణాలు మాత్రము అవుతూనేవున్నాయి.

ప్రచారము ముగిసినంత మాత్రాన ఇక పార్టీలన్నీ విశ్రాంతిగా వుంటాయని కాదు.  ఇప్పుడు తమ పార్టీకే వోటు వేయడానికి ప్రలోభాల పెట్టె కార్యక్రమము షురూ అవుతుంది.  వొట్లకు ఒకటి-రెండు రోజుల ముందే అంతా వారి వారి సొంతూరికి చేరుకుంటరు.  ఊర్లల్లో, పట్టణాలలో కొన్నికొన్ని ఏరేయాలలో పంపకాలు మొదలు అయితాయి.  ఆడ, మొగా, ఓటు కింతా అని డబ్బు పంపకాలు, డ్రింక్ వంటివి అందివబడుతాయి.  ఇదివరకే నాయకులంతా ఎవరెంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రము మాకే వేయండి అని అన్నారు కాబట్టి పేద ప్రజలు కూడా మొహమాటము లేకుండా డబ్బు తీసుకుంటరు.  తీసుకోకపోతే నాయకులకు అనుమానము  మాకు ఓటు వేయవా అని నిలదీస్తారు కూడా.  ఆ భయానికి కూడా డబ్బు, ఇంకా ఏమైనా ఇస్తే అదీ తీసుకుంటరు.  తర్వాత వారికి నచ్చిన వారికి వోటు వేస్తరు.  కుటుంబములో నలుగురు వుంటే నచ్చిన వారికి ఓ ఓటు ఎక్కువ మరొకరికి ఒకటి తక్కువ పడుతుంది.  డబ్బు తీసుకున్నందుకు ఇచ్చిన వాడికి ఎంతో కొంత న్యాయము చేయాలనుకుంటరు.  ఈ మాత్రము నిజాయితీ నాయకులకు వుంటే దేశము ఎంతో ముందికు పోయెదనుకుంట.

ప్రజా నిర్ణయము ఎలావుంటోందో వేచి చూడాలి మరి.

 

Wednesday, May 8, 2024

నుయ్యా? గొయ్యా?

 


తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారము జోరుగా జరుగుతుంది.  ప్రతీ పార్టీ ప్రత్యర్థి పార్టీని దుమెత్తి పోయటమే.  అది వింటే కాస్త ఆలోచన శక్తి వున్నవారికి ఏ పార్టీకి వోటువేయాలన్న భయమేస్తుంది. 

ఒకప్పుడు ఏ పార్టీకి ఎవరితో పొత్తో బహిరంగంగా తెలిసేది.  ఇప్పుడు అసలే అర్థం కాకుండా వున్నది.  తెలంగాణలో ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు జాతీయ పార్టీలుగా చెప్పుకోదగ్గవి రెండే.  కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అయిన ఆ పార్టీ ఎప్పుడు  వేరే రాష్ట్ర, లేదా జాతీయపార్టీ భుజాన ఎక్కి కానీ పోటీ చేసింది లేదు.  లోకలు గా వుండి జాతీయంగా ఎదగలనుకునేవి మరో రెండు పార్టీలు వున్నాయి.  ఒకటి ఇక్కడ హైదరాబాదుకే పరిమితం. ఇకపోతే తెరాస/భారాస.  తెరాసగా వున్నప్పుడు అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ప్రజలు దాన్ని గుర్తించి బాగా ఆదరించినరు.  అదికాస్త భారాసగా మార్చబడ్డాక తెలంగాణ ప్రజలకు అది మరొక కొత్త పార్టీ అయింది కానీ అది తెలంగాణ ఆస్టిత్వ పార్టీగా మారలేక పోయింది.  అంతేకాక పార్టీ నాయకుల వేషాలు, మోసాలు తెలిసినంక భారాస తెలంగాణ ప్రజలకు భారంగా అయింది.  అందుకే మార్పు మొదలైంది.

ఇప్పుడు ప్రచారములో రెండు జాతీయ పార్టీలు కూడా భారాస ప్రత్యర్థి పార్టీకి మద్దత్తు అని ప్రచారము చేస్తున్నాయి.  భారాస కూడా రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.  తెరవెనుక భాగోతాల సంగతి ఆ ఆ పార్టీ నాయకులకే తెలుసు.  

ఈ తికమకలే కాక ప్రజలకు మరో కొత్త సమస్య.  అది ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియట్లేదు.  ఇవ్వాళ పొద్దుట ఒక పార్టీలో వుంటే రేపు ఏ కండువా కప్పుకొని కనిపిస్తాడో తెలుస్తలేదు.  నాయకలకు విలువలు లేవు. సరే.  కానీ ప్రజలు చాలావరకు అట్లా లేరు కదా!  వారి జంపింగులను ప్రజలు అసహ్యిచుకుంటున్నరు.  ఒక్కరోజులోనే ఆ ఆ నాయకుల తిట్ల ప్రవచనాలు మారిపోతున్నాయి. నిన్నటి ఉత్తమోత్తమ నాయకుడు ఇవ్వాళ ప్రజకంటకుడౌతున్నడు.  ప్రజలకు ఒక విషయము మాత్రము స్పష్టంగా అర్థమైంది నాయకులు పనిచేసేది, పార్టీ మారేది ప్రజాసంక్షేమము కోసం కాదు, వారు అధికారములో వుండే కోసం, వారి ఆస్తులు కాపాడుకోవటము మరియు పెంచుకోవటముకోసమే.

నాయకులంతా స్వార్థపరులే అని అర్థమైనంక ఎవరిని ఎన్నుకోవాలి?  ఎవడికి దోచుకునే అవకాశము ఇవ్వాలి?  ఇదీ ఇప్పుడు  ఆలోచించాల్సిన విషయము.

Wednesday, May 1, 2024

నేటి రాజకీయాలు

 


భిన్నత్వములో ఏకత్వం

అన్నీ పార్టీల సిద్ధాంతం

చందమామను చూపి

ముక్క ఇచ్చి, చుక్క తాపి

కొంత రొక్కమూ ఇచ్చి

ఓట్లు వేయించుకోవటం

ఆధికారం చేజిక్కించుకోవటం

అదీ రాజకీయం.

 ***********

శత్రుత్వంలేదు, మిత్రత్వం లేదు

అంటరానితనం అసలే పనికిరాదు

శత్రువుతో సోపతి, ప్రాణమిత్రున్నైనా

నట్టేట ముంచటము

తేడా వస్తే వండి వడ్డించిన

చేతినే విరిచేయటము

అంతా ప్రజాభిష్టమే, కార్యకర్తల ప్రోద్బలమే

ఇదీ రాజకీయం - నేటి రాచరికం