Wednesday, June 23, 2021

మాస్కు మరువద్దు

 

భయం వద్దు, జాగ్రత్తలు అస్సలే మరువద్దు

ప్రస్తుతానికి లాక్డౌన్ ఎత్తేశారు.  సంతోషమే. మన వీలును బట్టి బైటి పనులు నిమ్మలంగా చేసుకోవచ్చు.  అట్లాగని అవసరమున్నా లేకున్నా బైటకు వెళ్లవద్దు.  కోవిడ్ తగ్గిందే కానీ పూర్తిగా పోలేదు.  అంతె కాక డెల్టా వేరియంట్ అని కోవిడ్ వైరస్ కొత్త రూపం దాల్చిందని, అది మరింత ప్రమాదకారి అని వార్తలు వస్తున్నాయి.  ఎన్ని వాక్సిన్లు తీసుకున్న మాస్కు మర్వొద్దు, భౌతిక దూరం పాటించాల్సిందే.

రాజకీయనాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తరు.  ఎన్ని అబద్ధాలు ఆడైన అధికారంలోకి రావాలనుకుంటరు.  రెన్నెల్ల క్రితం జర్గిన ఎలెక్షన్ల తరువాత దేశంలో ఎన్ని కోవిడ్ మరణాలు జరిగాయో అందరికీ ఎరుక వున్నది కదా.  ఎలక్షన్లు అయ్యాక మళ్ళా లాక్డౌన్ అన్నరు.  ఎలాంటి నిబంధనలు లేకుండా రాష్ట్రములో లాక్డౌన్ ఎత్తివేయడం కోవిడ్ అంతరిచిందని కాదు.  ప్రభుత్వం బాధ్యతను  దులుపుకోవడమే.  త్వరలో రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు తగిన సన్నాహాలు చేసుకునేందుకే.  వెన్నెముకలేని మేధావులు పాలన వ్యవస్థలో వుండి  ప్రజల మేలుకు ఏమి చేయాలో  సలహాలు ఇచ్చే బదులు బాంచను దొర అని కాళ్ళు మొక్కుతు వారి భవిష్యత్తును పదిలం చేసుకుంటున్నారే తప్ప ప్రజల సంక్షేమము పట్టించుకోవట్లేదు.  ప్రజలు వారి కష్టాలు వారు పడాల్సిందే, కోవిడ్ తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  

ప్రజలు కోవిడ్ వస్తే  వైద్యం ఏ చికిత్స విధానములో వైద్యము చేసుకుంటున్నారో, ఆ వైద్యవిధానములో మేధావులు ఏమి చెపితే అదే పాటించాలి.  ఇంటింటికి వచ్చి మనిషి మనిషికి కోవిడ్ మందుల పేరుతో మందులు ఇచ్చినా, తమకు వచ్చిన జబ్బు కోవిడ్ అని అనుమానం వస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే.  కోవిడ్ అని అనుమానపడి, కోవిడ్ లేదని రిపోర్టులో వచ్చినవాళ్లు కోవిడ్ ఉత్తదే, అనవసరంగా హంగామా చేస్తున్నారన్న మాటను పట్టించుకోవద్దు.  కోవిడ్ తీవ్రమైన జబ్బు కాకుంటే గడిచిన మూడు నెలల్లో జరిగిన విపరీత మరణాలకు కారణము ఏమిటి?  మరి దీని గురించి పరిశోధన చేయాల్సిన అవసరముంది కదా. 

ఎవరైనా ఏ విద్యలో నిష్ణాతులో, ఏ వృత్తిలో నిష్ణాతులో దాని గురించి మాట్లాడితే జ్ఞానాన్ని పంచినవారువుతారు,  ప్రజలకు మేలు చేసినవారవుతారు.  ఎక్కడో నాలుగు ముక్కలు చదివి, మూడు మాటలు విని దానికి సొంతవ్యాఖ్యానాలు రెండు జోడించి ప్రజలను అయోమయానికి గురిచేయడము మంచిది కాదు.  సొంత గొప్పల కోసం ప్రజల జీవితాలతో చెలగాటము ఆడటము నీతిమాలినతనము, అమానుషం.

లాక్డౌన్ లేకున్నా ప్రజలు, వారికోసం, వారి కుటుంబంకోసం, సమాజ శ్రేయస్సు కోసం జాగ్రత్తలు పాటించాలి.  అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు.  సిన్మాలు, పబ్బులు, రెస్టారెంట్లకు దూరం వుండటము మంచిది.  జబ్బు వచ్చాక ఏ నాయకులు పట్టించుకోరు.  గుంపులుగా తిరుగొద్దు, గుంపులున్న చోటికి వెళ్ళొద్దు.  ఓట్ల రోజు వస్తే ఆ రోజు జాగ్రత్తలు తీసుకుంటు ఓటు వేయడానికి వెళ్లొచ్చు కానీ అనవసరంగా, ప్రచార సభలకు వెళ్ళటము కాని, ప్రచారగుంపుతో తిరుగటము కాని చేయక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.   ఎక్కడికి వెళ్ళినా మాస్కు తప్పనిసరి, భౌతిక దూరం పాటించటము తప్పనిసరి.

ఆరోగ్యమే మహాభాగ్యము.  ఈ సంగతి కుటుంబములో కోవిడ్ వచ్చి, రకరకాలుగా బాధలు పది నష్టపోయిన వారికి బాగానే అర్థమౌతుంది.  ఆరోగ్యమే ఆనందము.



Monday, June 21, 2021

యోగా దినోత్సవం












అన్నీ సమయాల్లో మనస్సు స్థిరంగా సమత్వముతో ఉండటమే యోగం.  మనస్సు పరమాత్మలో లీనమవటము యోగం.  జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటము యోగం.

Tuesday, June 1, 2021

ఉచితం అనుచితం

 

కోవిడ్-19 ప్రపంచములో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.  ఇది మొదలై ఏడాదిన్నర అవుతున్న ఇంకా అంతా కొత్తనే, అయోమయమే.  ఎట్లా మొదలైంది, ఎవరికి వస్తుంది, శరీరంలో ఎట్లాంటి మార్పులు తెస్తుంది, ఎన్ని తిప్పలు పెడుతుంది దీని గురుంచి ప్రతిరోజూ రకరకలా మాధ్యమాల ద్వారా జనం తెల్సుకుంటున్నారు.  వైద్యులు వారు చికిత్స చేస్తున్నవారీలో లక్షణాలు, అవి ఎందుకు వచ్చాయన్న విశ్లేషణలు, అనుకున్నలేదా నిర్ధారణకు వచ్చిన కారణాన్ని బట్టి ఏమి మందులు ఎంత మోతాదులో వాడితే బాగుంటుందో అన్నది వారి వారి ప్రత్యేక సంఘాలలో తెలియచేసుకుంటూ, ఒకరికొకరు సలహాలిచ్చుకుంటూ జబ్బును త్వరితగతిన నయంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఒక స్థాయిలో అర్థము చేసుకునే విషయాలను కొంతమంది సామాన్యులకు కూడా ఉదారంగా చేరవేస్తున్నారు.  దీనివలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి.  ఏ వృత్తిలోనైనా వుండే మెళుకువలు, కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఆ వృత్తి చేసేవారికే అర్థం అవుతాయి.  నాలుగు మందుల పేర్లు తెలిసినంత మాత్రాన వైద్యం అంతా వచ్చనుకునే వాళ్ళకు ఏమిచెపితే ఏమి అర్థమౌతుంది?  కంచంలోకి అన్నం ఎట్లా వస్తుందంటే గిన్నెలో అన్నం వడ్డించుకుంటే సరి అన్నట్టుంది.

కోవిడ్-19 వచ్చినప్పటినుండి ముందు ఒక మందు పనిచేస్తుందని, తర్వాత అది కాదు వేరే వాడాలని మారుతూ వస్తుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే ఇంతవరకు వాడిన ఏ మందైన వైరస్ ఉదృతిని తగ్గిస్తుందే తప్పే శరీరంలో దానిని చంపే మందు ఇప్పటికైతే లేదు.  (ముందు ముందు వస్తుందని ఆశిద్దాము).  చాలా వరకు కోవిడ్ చికిత్స ఆ జబ్బు వల్ల వచ్చే లక్షణాలనుండి ఉపశమనము కలిగించేవి మాత్రమే.  కోవిడ్-19 అన్నీ రక్త నాళాలపైన, అన్నీఅవయవాలమీద ప్రభావము చూపిస్తున్నా, అత్యధికంగా దాని ప్రభావము ఊపిరితిత్తుల మీద వుంటుంది. శ్వాస ప్రక్రియ ద్వారా గాలి ఊపిరితితుల్లోకి పోయినప్పడు అక్కడ రక్తనాళల్లోకి ప్రాణవాయువు ఆక్సిజన్ పోయి, రక్తనాళల్లో వున్న కార్బండైయాక్సైడ్ ఊపిరితిత్తుల్లో  ప్రవేశించి బయిటకు వదలబడుతుంది.  వైరస్ వల్ల ఊపిరితిత్తుల్లో వివిధ మార్పుల వల్ల అవి అట్టల్ల (గట్టిగ) అయి వ్యాకోచించి,సంకోచించే గుణాన్ని కోల్పోయి వాయు మార్పిడి జరగకుండా ఆగిపోతుంది.  ఊపిరితిత్తులో జరిగే ఈ మార్పులు ఎంత తక్కువ కాలంలో జరిగాయి, ఎంత ఎక్కువ భాగాన్ని నాశనం చేశాయి అన్నదాని మీద ఆధారపడి రోగి కోలుకోవడము, కోలుకోక పోవడము జరుగుతుంది.  మరి ఇక్కడ డాక్టర్లు ఏమి చేస్తారనే ప్రశ్న.  ఆక్సిజన్ వారికి కావల్సిన మోతాదులో ఇవ్వడమే.  అంతే కాకుండా ఆ పరిస్థితిలో శరీరంలో జరిగే మార్పుల ఉధృతి తగ్గించడానికి, శరీర వ్యవస్థలో మరే తీవ్ర మార్పులు రాకుండా వుండటానికి మందులు ఇవ్వటము జరుగుతుంది.  ఒక జబ్బుకు, శరీరమార్పులకు, ఇచ్చే మందులకు వారి శరీరజీవ ప్రక్రియ ఎట్లా ప్రతిస్పందిస్తది అన్నది ఆ వ్యక్తి మానసిక-శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి వుంటుంది.  కొన్ని జన్యు పరమైన అంశాలు కూడా చికిత్సకు  ప్రతిస్పంద విపరీతంగా వుండవచ్చు.  ఆరోగ్యానికి పాలు ఎంతో మంచివంటాము.  కానీ పాలు పడని వారు కూడా వుంటారు.  

ప్రతి ఒక్కరు వారి వృత్తి నిబద్ధతో చేయాలని, పేరుతెచ్చుకోవాలని అనుకుంటారు.  వారి వృత్తి వారి జీవనాధారము, వారి కీర్తి, వారి ఐశ్వర్యము.  ఎవరైనా ఏదైనా చేసే పని బాగా చేసి గొప్ప చెప్పుకోవాలనుకుంటారా లేక పని పాడు చేసి తిట్లు శాపనార్థాలు తెచ్చుకోవాలని అనుకుంటారా?

ఒక MBBS డాక్టర్ కావాలంటే పదిహేను ఏళ్లనుండే అతిశ్రద్ధగా చదవాలి.  PG చేయాలి, ఆపై మరో స్పెషాలిటీ చేయాలంటే, సక్రమంగా అన్నీ పరీక్షలు క్రమము తప్పకుండ కావడమే కాదు, ఎక్కడ తప్పకుండ ముందుకు వెళితే 12-14 సంవత్సరాలు పడుతుంది.  అంటే ఒక వ్యక్తి స్పెషాలిటీ డాక్టర్ అయ్యేవరకు 30సంవత్సరాలు నెత్తిమీదికి వస్తాయి.  ప్రాక్టీసులో స్థిరపడడానికి మరో అయిదేళ్లు.  ఇప్పడికే సగం జీవితము అయిపోయిందికదా!  ఒక మనిషిని చంపాలనుకుంటే ఇన్ని ఏండ్లు కష్టపడాల్సిన అవసరము వుందా?   నాలుగు మందుల పేర్లు, పదో తరగతిలో అతి కష్టంగా గట్టెక్కి, వో రెండేళ్ళు దవాఖానలో పనిచేస్తే వైద్యం చేయవస్తే, గూగుల్ సెర్చ్లో  లక్షణాలు కొట్టి జబ్బెంటో, చికిత్స ఏంటో తెలుస్కో గల్గిన ఈ రోజుల్లో, రాత్రి పగలు కష్టపడి ఎంట్రెన్సులో సీటు కోసం కష్టపడటము, లాంగ్టర్మ్  కోచింగ్లకు వెళ్ళటము, ఆ తరువాత ఏండ్ల కొద్ది ఆకర్షణలన్ని పక్కనబెట్టి రాత్రి పగలు చదవటం పిచ్చి అని అనుకోవాలి.

ఏ వైద్య విద్యా నాలుగు రోజుల్లో, నెలల్లో వచ్చేది కాదు.  అన్నీ రకాల వైద్యాలు అందరికీ అందుబాటులో వుండాల్సిందే.  కాకపోతే ఎవరు ఏ వైద్యములో నిష్ణాతులైతే అదే చేయాలి.  అప్పుడే రోగికి న్యాయం జరుగుతుంది.  చదివింది ఒకటి చేసెది ఒకటైతే వారు చదివిన విద్య పట్ల వారికే గౌరవము, నమ్మకము లేదని అనుకోవాలి.  నమ్మకము లేని వైద్యము, తెలియని వైద్యము చేయటము నేరము కాదా?

జనాలైనా ఏ వైద్యాన్ని నమ్మితే అదే వాడాలి.  అన్నింటిని ఒకేసారి వాడి కొత్త సమస్యలు సృష్టించుకోవద్దు.  ఉచితంగా వచ్చినంత మాత్రాన ఏది పడితే అది తింటామా?   కష్టం వున్నప్పుడు తొందర పడకుండా హేతుబద్ధతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరము వుంటుంది. మన అవసరాలు బట్టి ఆ రంగములో నిపుణుల సలహా తీసుకోవటము చేస్తే జీవితము సాఫీగా సాగుతుంది.

న త్వహమ్ కామయే రాజ్యమ్

న స్వర్గమ్ నాపునర్భవమ్

కామయే దుఃఖతప్తనామ్

ప్రాణినామ్ ఆర్తినాశనమ్



 

Thursday, May 27, 2021

తస్మాత్ జాగ్రత్త


కోవిడ్ అంటే అందరికీ భయం పట్టుకుంది.  టీకా తీసుకోవాలనే జ్ఞానము కూడా ఇప్పుడు అందరికీ వచ్చింది.  అంతా టీకా తీసుకోవాలని ఎంతో ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు.  ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లాలంటే కోవిడ్ -19 టీకా సర్టిఫికేట్ తప్పనిసరి.  మొదోట్లో టీకా ఇచ్చినప్పుడు జనాలు భయపడి రకరకాల అపోహలతో టీకా తీసుకోకున్న ఇప్పుడు మాత్రం పెద్ద వరసల్లో నిలబడి కష్టపడి తీసుకుంటున్నారు.  మంచిదే.  కానీ, టీకా తీసుకునే ఆతృతలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరిచిపోవొద్దు.

కోవిడ్ రాకుండా జాగ్రత్తలు, మాస్కు, భౌతిక దూరం పాటించటము, చేతులు శుభ్రంగా వుంచుకోవటము తెలిసినవే కదా.  అవి మరిచిపోవద్దు.  

టీకా కోసం ఆసుపత్రికే వెళ్ళాలి కదా.  అక్కడ కోవిడ్ పరీక్షకు వచ్చేవాళ్లు కూడా వుండే అవకాశము వుంది.  కాబట్టి వీలైనంత తక్కువ సమయములో పని పూర్తి అయేటట్లు ప్రణాళిక వేసుకోవాలి.  ముఖానికి shield, చేతులకు gloves తొడుక్కుంటే మరీ మంచిది.  చిన్నపాటి sanitiser సీసా ఎట్లగూ దగ్గర వుంటుది కదా.  అవసరమనిపించినప్పుడు అది కాస్త చేతుల మీద వేసుకొని తుడ్చుకుంటు వుండాలి.  

టీకా తీసుకునే తొందరలో ఏ ఒక్కరి దగ్గరలో నిలబడ వద్దు.  మాటలాడేటప్పుడు మాస్కు అస్సలే తీయొద్దు. 

ఉదయము ఏమైనా తినే వెళ్ళాలి.  దగ్గర నీళ్ళ సీసా వుంటే మంచిది.  ఎండాకాలం, నోరు తడారిపోకుండా అవసరమైనప్పుడు నీళ్ళు త్రాగటం మంచిది.

టీకా తీసుకునేటప్పుడు కానీ, ఆ తరువాత అరగంట వేచివుండాల్సి వచ్చినప్పుడు కానీ  ఎక్కువమంది గాలి వెలుతురు దారాళంగా రాని రూములో వుండాల్సి  పరిస్థితి వుంటే అక్కడ వుండకుండా బైట గాలి వెలుతురు వుండేచోటు వచ్చి వుండేటట్లు చూసుకోవాలి.  

ఆసుపత్రిలో రోగులు వేచి వుండేచోట లేదా రక్తమూత్ర పరీక్షాకేంద్రం వద్ద అసలే వేచి వుండొద్దు. 

 కొత్తవాళ్ళే  కాదు, స్నేహితులు బంధువులతో కలసి వెళుతున్నా జాగ్రతలన్నీ పాటించాల్సిందే.

టీకా తీసుకున్నాక వారములో కాస్త ఒళ్ళు వెచ్చగా వుండటము, ఒకటి రెండు విరేచనాలవటము, ఇంజెక్క్షన్ తీసుకున్న చోట కాస్త నొప్పి వుండటము మామూలే.  ఏదైన ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే   ఫ్యామిలి డాక్టర్ను సంప్రదించాలి.  

టీకా తీసుకునేవారు వారు ఆదివరకు వాడుతున్న బీపీ, షుగర్, థైరాయిడు మొ. మందులు తప్పనిసరిగా వేసుకోవాల్సిందే.  ఏ కారణము వల్లనైనా వేరే ఇతర మందులు వాడుతున్నట్లైతే రెగ్యులర్ డాక్టరును సంప్రదించాక టీకా తీసుకోవాలి.

టీకా తీసుకునే ముందు, తర్వాత కూడా తగు జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ -19 నుండి రక్షణ పొందవచ్చు.   టీకా తీసుకున్న తర్వాత కూడా ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్-19 నివారణ పద్దతులు పాటిస్తే కోవిడ్ను నియంత్రించవచ్చు.

గతే శోకం న కర్విత

భవిష్యం న ఏవ చింతయేత్

వర్తమానేషు కాలేషు

వర్తయంతి విచక్షణః



Thursday, May 20, 2021

స్వీయనియంత్రణే కోవిడ్19 నియంత్రణ

 


ఈ కోవిడ్ కాలములో ఏ కాస్త జ్వరం వచ్చిన, దగ్గు వచ్చిన అదేనా అని భయం.  పక్కవాడు తుమ్మిన, దగ్గినా కోపము, భయం.  ఇంత భయపడే వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారే అంటే తక్కువే.  కోవిడ్ అతి సూక్షమాతిసూక్ష్మతర జీవికాని జీవి, గాలి ద్వారా వస్తుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  కోవిడ్ నిబంధనలు మన జీవితములో భాగం కావాల్సిందే. మొదటి సారి వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి, పోతాయి, మనం మాత్రం ఎప్పటికీ వుంటా మనుకున్నాము.  ఏదో పొరపాటుగా పోయిన వాళ్ళు పోయినా మనది మాత్రము గట్టి ప్రాణం అని సంతోషపడ్డము.  కానీ రెండో ఉధృతిలో అయితున్న మరణాలు అందరికి వణుకు పుట్టిస్తున్నాయి.  మొదటి విడుత ఎక్కువగా వయస్సు 50సం. కంటే ఎక్కువ వున్నవారు, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలున్నవారు పోతే, ఇప్పుడున్న రెండో ఉధృతిలో తక్కువ వయసున్నవారు, వయస్సులో వున్నవారు, ఇంతకుమునుపు ఏ జబ్బులేనేవారు, ఇంటికి ఒకరికి మించి చనిపోవడము అందరని భయాందోళనలకు గురిచేస్తుంది.  అయినా ఇప్పటికీ కూడా ప్రజల్లో చాలా నిర్లక్ష్యమే వున్నది.  టీకా వేసుకున్నా కూడా అది సంజీవని కాదు.  కాబట్టి తప్పనిసరిగా అందరరు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే---

– అవసరమైతేనే బయిటకు వెళ్ళటము, 

వెళ్ళిన చోట భౌతిక దూరం పాటించటము, 

తప్పనిసరిగా మాస్కు ధరించటము, 

మాట్లాడేటప్పుడు అస్సలే మాస్కు తీయకుండా వుండటము, 

తినేటప్పుడు మౌనంగా తినటము,   

బైటకు వెళ్లినప్పుడు చేతులు పరిశుభ్రంగా వుండటముకోసం సానిటైసర్,  సానిటైసర్ ఎక్కువసార్లు వాడాల్సిన అవసరము వుంటే చేతులకు గ్లౌసు తొడుక్కోవాలి.  వాటిపైనే సానిటైసరును వాడుతువుండాలి.  

చాలా సమయము రద్దీలో గడపల్సిన పరిస్థితి వుంటే ముఖానికి షీల్డు- ముఖ కవచము పెట్టుకోవటము శ్రేయస్కరము.

పైన చెప్పిన కోవిడ్ నిబంధనలు, వాటివలన కోవిడ్ వ్యాప్తి ఎలా అపవచ్చు అందరికీ అవగాహన వచ్చింది.  అయిన కేవలము నిర్లక్ష్యముతోనే రెండో ఉద్ధృతిలో ఎంతోమంది ప్రియబాంధవులను కోల్పోతున్నాము.  మనమంతా తెలుస్కోవాల్సింది, అర్థము చేసుకోవాల్సింది ఏమంటే ఈ కోవిడ్ జబ్బు ఇప్పట్లో పోయేది కాదు.  ఎక్కువగానో తక్కువగాను ఎప్పటికీ వుంటుంది.  మూడో ఉధృతి వస్తుంది అని ఒక దిక్కు అనుకుంటుంటే, ప్రపంచములో ఓ చోట నాలుగో ఉద్ధృతి కూడా మొదలైనదట!  హెచ్1ఎన్1 ఇన్ఫ్లూఎంజా వచ్చింది, ఇప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఇంకా వస్తూనే వుంది.  కానీ దాని వ్యాప్తి, తీవ్రత కోవిడ్ 19 తో పోలిస్తే చాలా తక్కువ. 

మన దేశ జనాభా, జనసాంద్రత పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ.  మన ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం మీద పెట్టె ఖర్చు చాలా తక్కువ.  కోవిడ్19 వంటి జబ్బలుకు చికిత్స చేయాలంటే ఎన్నెన్నో మౌలిక వసతులను మెరుగు పరచాలి. ఎంతోమంది డాక్టర్లు, ఆరోగ్యసిబ్బంది అందుబాటులో వుండాలి. ఔషదాలు, పరికరాలు కావాలి.  అప్పటికప్పుడు ఏదో చేసి గండం గట్టెక్కలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితే చూడాల్సి వస్తుంది.

కోవిడ్19 అంత త్వరగా ప్రపంచమునుండి పోయేది కాదు.  ఇంతవరకు ప్రపంచములో టీకా తో అంతమైనది ఒకే ఒక జబ్బు – మశూచి మాత్రమే.  ఎన్ని టీకాలున్న ఆ జబ్బులు ఎక్కడోఅక్కడ ప్రపంచములో వస్తూనే వున్నాయి.  అంటూ వ్యాధుల నివారణకు అత్యుత్తమ ఉపాయము పరిశుభ్రత, పౌష్టికాహారము, స్వీయనియంత్రణే.  

ప్రభుత్వము లాక్ డౌన్ విధించినా, విధించకున్న, కర్ఫ్యూ పెట్టిన పట్టకున్నా మన జాగ్రతలో మనముందాము.  స్వీయనియంత్రణ పాటిద్దాము.  కోవిడ్ 19 ప్రపంచమునుండి పారద్రోలుదాము.



సమయే భోజనం నిద్రా

సమయే స్నానమాచరే

వ్యాయామం సమయే కుర్యాత్

యమో భీతొ గమిష్యతి

 

Wednesday, May 19, 2021

సొంత వైద్యం హానికరం

 

వాట్సాప్, టిక్ టాక్ వీడియో మాధ్యమాలు వచ్చాక ఎంతోమంది పొద్దున్న లేచినప్పుడు పాచి ముఖంతో ఆవలింతే తీసినప్పటి నుండి రాత్రి పక్కమీద మెత్తను కౌగలించుకొని పడుకునే వరకు, వారి తాతమ్మలనాడు పాటించిన చిట్కాల నుండి నేటి కాలములో వారు వారి తెలివితో కనిబెట్టిన ఎన్నో చిట్కాల గురించి వీడియొలు పెడుతున్నారు.  చూసేవాళ్ళు కొంతమంది, వాటిలో నిజానిజాలు తెలిసికోకుండా గుడ్డిగా పాటించేస్తున్నారు.  ఈ కోవిడ్ కాలములో ఆవిరి పీల్చటము, వేడినీళ్ళు తాగటము చాలా ఎక్కువమంది పాటించారు.  మామూలుగా ముక్కు దిబ్బడ వేసినప్పుడు ఏదో ఒకటి రెండుసార్లు కాస్త వేడినీటిలో విక్స్ వేసే పీల్చుకోమనటము విన్నాను.  అంతేకాని ఆరోగ్యంగా వున్నవాళ్లు ఇలా ఆవిరి పీల్చుకోమని ఎవరు మొదలు పెట్టరో కానీ, జనాలు గుడ్డిగా దానిని పాటించడము మొదలైనది.  మన చర్మము, శరీరములో అన్నీ రంద్రాలలో ఆ ఆ చోట రక్షణ కవచాలుగా పొరలు,సూక్ష్మజీవులు,కొన్ని ద్రవాలు, వుంటాయి.  ఉష్ణోగ్రతలలో తీవ్ర మార్పులు, అనవసరంగా వాడే రసాయనాల వలన ఇవి దెబ్బతినే అవకాశము వుంటుంది.  నోట్లో బాగా వేడి నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది?  నాలుక కాలుతుంది, నోట్లో, పెదవుల్లోపలి వైపున వుండే సున్నితమైన పొర దెబ్బతింటుంది.  అలాగే, ఇష్టమొచ్చినట్టుగా మాటిమాటికి ఆవిరి పీలిస్తే ముక్కులో వుండే సన్నని పొర దెబ్బతిని సూక్ష్మజీవులకు, ఊపిరితిత్తుల్లో ప్రవేశించట్టానికి రహదారినిచ్చేస్తుంది.

ఆరోగ్యం గురుంచి ఎవరైనా చిట్కాలు చెప్పితే అవి ఏ వైద్యవిధానములో వున్నది, చెప్పేవారు ఆ వైద్యవిధానములో నిష్ణాతులేనా అని తెలుసుకోవాలి.  మీ దగ్గరలో వున్న అదే వైద్యనిపుణలను ఆ విషయము గురించి అడిగి తెలుసుకోవాలి.   ఇప్పుడు పత్రికల్లోనో, అంతర్జాలములోను నిపుణుల సమాధానాలు వస్తున్నాయి కదా, అట్లగైన తెలుసుకోవాలి.  ఆ పద్ధతి మీ పరిస్థితికి సరిపడుతుందా తెలుసుకోని పాటించాలి.  వైరల్ వీడియో అయిందని, ఎవరో మేము పాటించాము అని చెప్పితే విని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. బాగా చదువుకున్నవారైతే, మీరు అందులో హేతుత్వము ఎంత వుందో కాస్త ఆలోచించండి.  శాస్త్రీయత వేరు, శాస్త్రం లేదా ఆచారం వేరని అనుకోవద్ధు. ఆ కాలాన్ని అనుసరించి శాస్త్రీయంగానే ఆచారం వచ్చివుంటుంది.  మూఢంగా పాటిస్తే మూఢాచారము అవుతుంది, తెలుసుకోని పరిస్థితికి తగినట్టుగా అన్వయించుకొని పాటిస్తే మంచి ఫలితన్నే ఇస్తుంది.

అలాగే వేడి నీళ్ళు తాగటము.  నీళ్ళు పరిశుబ్రమైనవి కావనుకున్నప్పుడు – బావి నీరు లేదా చెరువు, బోరు నీళ్ళు వాడుతున్నవారు,  మున్సిపాలిటీ నల్లా వస్తున్నా, అవి కలుషితంగా వున్నాయని అనిపిస్తే, నీళ్ళు మస్లబెట్టి చల్లార్చుకొని తాగటము వలన కలుషిత నీటివల్ల వచ్చే చాలా జబ్బులను నివారించవచ్చు.  వట్టినే నీళ్ళు వేడిగా తాగటముతో ప్రయోజనమేమీ వుండదు.  వేడి నీళ్లుకాని, బాగాచల్లగా వున్న నీళ్ళు మనము ఎక్కువగా తాగలేము.  ఆ ఆ వాతావరణాన్ని బట్టి సరైన ఉష్ణోగ్రత వున్న నీళ్లు తాగుతాము.  సామాన్యముగా ఏ జ్వరము వచ్చిన, ముఖ్యంగా విరేచనాలు అవుతున్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరము వుంటుంధి.   అలాంటప్పుడు పరిశుబ్రమైన నీళ్ళు ఎక్కువగా తాగటము మంచిది.  వాంతులు వున్నప్పుడు తప్ప, ఒంట్లో బాగలేనప్పుడు, తినలేకపోయినా నీళ్ళు లేదా వేరే ఇతర ఆరోగ్యకరమైన ద్రవపదార్థాలు (కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పండ్లరసాలు మొ.) తాగటము ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

అంతర్జాలములో వివిధ వీడియొలు, ఆడియోల ద్వారా వచ్చేవాటిని గుడ్డిగా నమ్మోద్దు.   మన అవసరలను బట్టి ఆ ఆ రంగములో నిపుణులు చెప్పినదే నమ్మాలి.  అవసరమనుకుంటే ఒకరిద్దరి వైద్యుల అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవటం మంచిది.


వినదగునెవ్వరు సెప్పిన

వినినంతనే వేగపడక వివరింపదగున్

గని కల్ల నిజము దెలిసిన

మనుజుడె నేర్పరి మహిలో  సుమతీ!

Tuesday, May 18, 2021

మాస్కే రక్ష

 

3-10-2009 రోజు సద్దుల బతుకమ్మ, హన్మకొండ


కోవిడ్ నివారణకు మాస్కు ధరించటాము అత్యంత అవసరము.  మాస్కు పన్నెండు యేళ్ళ క్రితం కూడా హెచ్1ఎన్1 ఇన్ఫ్లూయెంజా అనే ఊపిరితిత్తుల వ్యాధి రాకుండా వాడాలని చెప్పితే, అప్పుడు చాలా కొద్ది రోజులు అక్కడక్కడ కొద్దిమంది రద్దీ ప్రదేశాలలో పెట్టుకున్నారు.  గాలి ద్వారా వచ్చే infections, allergies రాకుండా మాస్కు వాడటము తప్పనిసరి.  అట్లాగే అవయవమార్పిడి జరిగిన వారు, రోగనిరోధక శక్తి తక్కువ వున్నవారు కూడా మాస్కు ధరించటాము జరుగుతుంది. దావఖానల్లో ఆపరేషన్ థియేటర్లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే.  మాస్కు ధరించటాము వల్ల మనకు infections తగ్గిపోవడమే కాకుండా మనకు వున్న infections ఇతరులకు సోకవు.  నోటి తుప్పిల్ల ద్వారా కానీ గాలిలో వుండే సూక్షమాజీవులు, కొన్నిపుష్పాల పుప్పొడి రేణువులు, దుమ్ము ధూళి వల్ల వచ్చే జలుబు, దగ్గు, దమ్ము వంటి వ్యాధులు కూడా నివారింప వచ్చు.

మామూలుగా గాలి దుమ్ము ధూళి వల్ల కలిగే రుగ్మతలు రాకుండా సాధారణ నూలు వస్త్రం కూడా బాగానే పనిచేస్తుంది.  disposable సర్జికల్ మాస్కులు రాకముందు ఆపరేషన్ థియేటర్లలో నూలు వస్త్ర మాస్కులనే వాడేవారు.  సర్జికల్ మాస్కులు వచ్చాక కొద్ది ఏళ్లలో అంతా మెల్ల మెల్లగా ఇవే వాడటము, ఇప్పుడైతే ప్రతిచోటా ఇవే వాడటము జరుగుతుంది.  వస్త్ర మాస్కుల కంటే సర్జికల్ మాస్కుల వలన ఇరుపక్షాలకు రక్షణ ఎక్కువ.  అదే N95 అయితే మరింత ఎక్కువ. 

మాస్కుల గురించి, వాటి ప్రస్తుత అవసరాన్ని,  వాడే విధానాన్ని ప్రతిఒక్కరు వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు.  కోవిడ్ వల్లనే N95 బాగా వ్యాప్తిలోకి వచ్చింది.  డాక్టర్లకె కాదు సామాన్యులకు కూడా కోవిడ్ నివారణకు ఈ మాస్కు ధరించటము తప్పనిసరి.

మామూలుగా వున్నప్పుడు శ్వాస ఆడినట్టు మాస్కు వున్నప్పుడు వుండదు.  మొదట్లో కాస్త ఇబ్బంది వున్న తర్వాత అలవాటైపోతుంది.  ఆరోగ్యంగా వున్నవాళ్లు, కాస్త నడక, కొద్దిపాటి వ్యాయామాలు కూడా చేయవచ్చు.  ఎన్95 వాడుతున్నప్పుడు మాత్రము ఎక్కువ ఇబ్బంది వుంటుంది.  ఎన్95 మాస్కు ధరించినప్పుడు వేగమైన నడక లేదా వ్యాయామాలు చేయకూడదు.

ఈ మధ్య వైరుస్ విజృంభణ అధికంగా వుంది కాబట్టి రెండు మాస్కులు ధరించమని చెపుతున్నారు.  ఇది ముఖ్యంగా నూలు మాస్కులు ధరించే వాళ్ళు తప్పనిసరిగా చేయాలి  వైరుస్ అంతరించే వరకు పాటించటము మంచిది.  అలాగే ఎన్95 కంటే సర్జికల్ మాస్కు రక్షణ తక్కువ కాబట్టి వారు కూడా రెండు మాస్కులు ధరించాలని చెపుతున్నారు.  సర్జికల్ మాస్కు ధరించిన వారు ముందు సర్జికల్ మాస్కు ధరించి దానిపై వస్త్రము ధరించాలి.  అలా ఐతే శ్వాసకు ఇబ్బంది వుండదు.  ఎన్95 ధరిచినవారు మాత్రము రెండు మాస్కులు ధరించాల్సిన అవసరము లేదు.  పద్ధతిగా రోజువారిగా మారుస్తూ పోతే సరిపోంతుంది.  ఉతకడానికి అనువైన ఎన్95 మాస్కులను కంపెనీ వారిచ్చిన సూచనలను బట్టి వాడాలి.

మాస్కు ఉపయోగము గురించి ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసింది కాబట్టి వారి వారి ఆరోగ్యాన్ని, అవసరాన్ని బట్టి ముందుముందు కూడా వాడితే మంచిదే.  ఈ కోవిడ్ అంతమైన తరువాత కూడా,సర్ది దగ్గు వున్నప్పుడు, చాలా రద్దీ ప్రదేశాలు , దుమ్ము ధూళి వున్న ప్రదేశాలలో వున్నప్పుడు, దూరప్రయాణాలు ద్వి, త్రిచక్రవహానాపై ప్రయాణిస్తున్నపుడు, బసుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కనీసం వస్త్ర మాస్కైన ధరిస్తే, ఊరు వెళ్ళి వచ్చినాక వచ్చే జ్వరము, జలుబు, దగ్గు, దమ్ము రాకుండా వుంటాయి.

మన ఆరోగ్యం మన అవసరము.  ఎవరైనా ఏమనుకుంటారో అని అనుకుంటూ మన రక్షణ మనం మానోద్దు. మాస్కుతో నివారించగలిగిన గల్గిన జబ్బులకు మందులవరకు ఎందుకుపోవాలే?


Monday, May 17, 2021

ఆరోగ్యమే మహాభాగ్యము

 

కరోన వైరస్ ప్రపంచాన్ని వణికించబట్టి ఏడాదిన్నర కావస్తుంది.  అయిన ఆ మహమ్మారి ఇప్పట్లో నెమ్మదించేటట్లు లేదు.  చైనాలో మొదలైనప్పటినుడి అన్నీ మాధ్యమాల్లో వచ్చే వార్తులు, వివరాలు చూస్తూనే వున్న.  ఎందరో రాస్తున్నారు, తెలిసి కొంత, తెలియకపోయిన చాలా.  కొన్ని పిచ్చి రాతలు – సలహాలు చూసినప్పుడు చాలా చికాకు కలిగేది, కొన్నిసార్లు బాధ కూడా కలిగిది.  ఆ సూచనలు పాటించి ఎంతోమంది ఆరోగ్యం పాడు చేసుంకుంటారేమో అని.  కానీ నేను ఏమి రాయలేక పోయిదాన్ని.

కరోన ఓ కొత్త జబ్బు.  దాన్ని గురించి ప్రస్తుత పరిస్థితుల్లో మామూలు జనాలకు ఎంత తెలుసో, డాక్టర్లకు దాని కంటే కొంచెం ఎక్కువ తెలుసు.  అది వారి వైద్యవిద్యా పరిజ్ఞానము వలన.  అది ఎట్ల వస్తుందన్న దాని గురుంచి రకరకలుగా చెప్పి, ఇప్పుడు గాలి ద్వారా అంటున్నారు.  ఊపిరి తిత్తులకు వచ్చే చాలా జబ్బులు గాలిద్వారానే వస్తాయి.  ఏ సూక్ష్మజీవి అయిన  మన ఒంట్లోకి ఆహారం ద్వారనో (తినేది, తాగేది), గాలి ద్వారనో, గాయాలద్వారానో లేదా స్పర్శ ద్వారనో వస్తుంది.  కాబట్టి ప్రస్తుత పరిస్తుతుల్లో మనకు అర్థం అయ్యేదేమంటే కరోన వైరస్ ఈ అన్నీ మార్గాల్లో రావచ్చని. ఒకే ఇంట్లో వుండే వాళ్ళు ఒకే వాతావరణములో వుంటారు కాబట్టి, ఇంట్లో ఏ ఒక్కరికీ సర్ది దగ్గు వచ్చిన సామాన్యంగా అందరికీ అంటుకుంటుంది.  పకపక్క ఇండ్లవాళ్లు కలసి మెలసి వుంటే వారి నుండి వీరికి, వీరినుండి వారికి అంటుకుంటుంది.  ఇది అందరికీ తెలిసిన విషయమే కదా!

సూక్ష్మ జీవుల వలన వచ్చే జబ్బులు (infections ) రోగనిరోధక శక్తి తక్కువ వున్న వాళ్ళని, అపరిశుభ్రంగా వుండేవాళ్ళకు ఎక్కువగా వస్తాయి.  జబ్బులు రావద్దంటే మొట్టమొదట కావాల్సింది పరిశుభ్రత.  పరిశుబ్రత అంటే మన ఒళ్లే కాదు, ఇల్లు, పరిసరాలు, ఆహారం కూడా.  వీటిని మనము ఎంతవరకు పాటిస్తున్నాము ఒకసారి ఆలోచించుకోవాలి.  ఇప్పుడు ఈ వైరుసే కాదు, ఇదివరకు, ఇప్పుడు కూడా వస్తున్న దోమలు, ఈగలు  వల్ల వచ్చే జబ్బులను కూడా పరిశుబ్రత వల్ల అరికట్ట వచ్చు.  పరిశుభ్రమైన ఆహార పానీయాలు  తీసుకోవటం వలన ఎన్నో జీర్ణవ్యస్థ (వాంతులు, విరోచనాలు, కామెర్లు, టైఫోయిడ్ మొ.) జబ్బులను నివారించ వచ్చు. 

ఏవైనా జబ్బులు వచ్చిన రోగనిరోధక శక్తి చక్కగా వున్నవారికి ప్రాణాపాయం కలిగించవు.  కొంచెం ఇబ్బంది అయిన త్వరగానే తగ్గిపోతాయి. 

రోగనిరోధక శక్తి బాగా వుండాలంటే సరైన ఆహారము తీసుకోవటము, తగినంత వ్యాయామము చేయటము అవసరము. సమతుల ఆహారము తీసుకోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు.  సమతుల ఆహారమంటే ఏమిటో, రోజు ఆహారములో ఏమేమి వుండలు అని తెలుసుకొని, మన కున్న వనరులతో అవి సమకూర్చుకోవచ్చు.  నిరుపేదలకు కాస్త కష్టం కావచ్చు కానీ వేరే అందరికీ అది అందుబాటులో వుంటుంది.  కాకపోతే కొంత ప్రణాళిక వుండాలి, కొంచెం కష్టపడాల్సి రావచ్చు.  ఉదా. మార్కెట్కు నడిచి వెళ్లాల్సి రావటము.  ఆ నడకను ఒక వ్యాయాముగా తీసుకుంటే సమస్యే లేదు.  నడక అన్నీ విధాలా మంచిదే. 

వ్యాయామము మన జీవన శైలిలో ఒక భాగంగా మనము గుర్తించట్లేదు.  బీపీ, షుగరు వస్తే తప్ప వ్యాయామము చేయాలనే ఆలోచన సామాన్యంగా చాలా చాలా తక్కువ జనాల్లో వుంటుంది.  ఎవరైనా రోజు పొద్దుటే నడవడానికి వెళుతున్నారంటే వెంటేనే అనుమానం, వాళ్ళకు బిపినో షుగరో వుందని.  చాలా మంది గృహిణులు మేము ఇంటి పని చేస్తాము కాబట్టి వేరే వ్యాయామము అవసరము లేదనుకుంటారు.  విద్యుత్తుగృహోపకరణాలు లేని రోజుల్లో, స్వీయా వాహనాలు చాలా తక్కువ వున్న రోజుల్లో, ఉమ్మడికుటుంబాలు (ఒకే ఇంట్లో ఇరవైమంది కంటే ఎక్కువ వున్న ఇళ్ళలో), ఆ కాలాల్లో సమస్త గృహకార్యాలుకు మించిన వ్యాయామము అవసరముండేది కాదు.  గృహోపకరణాలు ఎక్కువై, కుటుంబాలు చిన్నవై, అడుగు బైటపెడితే వాహానాల్లోనే అయిన ఈ రోజుల్లో వ్యాయామము కోసం రోజుకు అరగంట, కనీసం 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవటము మంచిది.  ఆలోచన వుంటే తీరిక అదే దొరుకుతుంది.  వ్యాయామము దేహదార్ధ్యాన్ని పెంచుతుంది.  హృదయం, ఊపిరితిత్తుల సామర్థ్యము పెరుగుతుంది.  ఏదైనా జబ్బు వలన వీటిపై ఒత్తిడి పడినప్పుడు తట్టుకొని సులువుగా బైటపడవచ్చు.  

శారీరక బాధలు కలిగినప్పుడు, జీవితములో వున్న నానా సమస్యల వలన మానసికంగా వత్తిడి కలగటము సహజమే.  మానసిక ఆరోగ్యానికి అధ్యామికత ఎంతో సహకరిస్తుంది.  మానసికంగా ఆరోగ్యంగా వున్న వ్యక్తి శారీరక రుగ్మతల నుండి త్వరగా బయటపడగల్గుతారు.  ఒకప్పటి కాలములో పూజలు సoధ్యావందనాలు వుండేవి.  ఇప్పుడు కూడా ఇవి జరుగుతున్నై, కానీ చాలా కొద్ది కుటుంబాలలో మాత్రమే.  శాస్త్రీయ పరిజ్ఞానము పెరిగి పూజలు సంధ్యావందనాలు  తగ్గిపోతున్నై.   చాలా వరకు పూజలు చేస్తే కేవలము వారి కోరికలు తీర్చమని విన్నపాలు పెట్టుకోవడానికి మాత్రమే.  ఫర్వాలేదు.  మనకంటే ఒక అతీత శక్తి వుంది అని నమ్ముతున్నారు కదా.  ఆ అతీత శక్తిని ఎప్పుడో ఒకసారి పూజించే బదులు రోజు పూజించవచ్చు కదా.  పూజకని ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ధ్యానించవచ్చు కదా!  ఏమి చేయక్కర్లేదు, నచ్చిన భాగవణ్ణామము తీసుకొని ప్రశాంతంగా ఇతర ఆలోచనలు లేకుండా కుర్చింటే చాలు. ఆస్తికులైనా, నాస్తికులైన ప్రతిరోజు ఉదయము సాయంత్రము 10-15 ని. ప్రశాంతంగా కూర్చొని  మెదడుకు, మనస్సుకు కాస్తే విశ్రాంతి ఇస్తే మిగిలిన 23.5 గం.  అవి ఆ వ్యక్తికి మానసికోన్నతిని, వ్యవహారశైలిలో నిశ్చలతని ఇస్తాయి. 

శరీరము, మనస్సు ఆరోగ్యంగా వుండటానికి ఏమి చేయాలో చేస్తున్నా, వాటికి హాని కలిగించే వాటికి దూరంగా వుండటము అంతే అవసరము.  దురాలవాట్లు అంటే ఏమిటో అందరికీ తెలుసు.  సరదాకనో లేదా భేషజాలకు పోయో ఆరోగ్యానికి హాని కలిగించే వాటికి దూరం వుండటము కూడా ఎంతో అవసరము. 

ఎవరైనా జీవితము ఆనందంగా సాగాలని కోరుకుంటారు.  ఆనందంగా వుండాలంటే ఆరోగ్యంగా వుండటము అవసరము.  మనము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండాలంటే  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.  జబ్బు వచ్చినప్పుడే ఆరోగ్య సూత్రాలు పాటించడము కాదు.  అదిది నిరంతర ప్రక్రియ.  తొలి ఊపిరి తీసుకున్నప్పటినుండి చివరి ఊపిరి ఆగిపోయేవరకు పాటించాల్సిందే.

సర్వే భవన్తు సుఖినః

సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యన్తు

మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్

గమనిక:  ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిపుణులను సంప్రదించండి.  సొంత వైద్యం ప్రమాదకరము.